ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల కు ఎస్ఈసీవో షాక్ ఇచ్చారు. ఓటర్ల జాబితాలో వాలంటీర్ల జోక్యం తగదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించకూడదని కలెక్టర్లను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్ ఎలాంటి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. వారు పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండటానికి వీల్లేదని .. ఈ అంశంపై కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ పోలింగ్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని సీఈవో ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి పంపుతున్న సూచనలు, సలహాలు తప్పక పాటించాలన్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ను నియమించారు. యాభై ఇళ్లలోని ఓటర్ల వివరాలన్నీ వాలంటీర్ల దగ్గర ఉంటాయి.ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని.. ఓటర్ల జాబితా అంశంలోనూ చేతి వాటం చూపిస్తున్నారని కొంత కాలంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఈ ప్రక్రియను బూత్ లెవల్ ఆఫీసర్లు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అయితే పని భారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ప్రతి యాభై ఇళ్ల సమాచారం వాలంటీర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియను వాలంటీర్లతో పూర్తి చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. దీనిపై రాజకీయ పార్టీలు ఏమైనా ఫిర్యాదు చేశాయో లేదో స్పష్టత లేదు కానీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియలోనూ వారు జోక్యం చేసుకోవద్దన్న ఆదేశాలు వెలువడ్డాయి. ఏపీలో జరుగుతున్న ప్రతి ఎన్నికలోనూ వాలంటీర్ల పాత్ర వివాదాస్పదవుతోంది. స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఎస్ఈసీ వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. ఆ సమయంలో వాలంటీర్ల వద్ద ఉన్న ఫోన్లను కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలన్నారు. అయితే ప్రభుత్వం కోర్టుకెళ్లి ఆ ఆదేశాలపై స్టే తెచ్చుకుంది. ఆ తర్వాత తిరుపతి లోక్సభ, రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలు జరిగినా ఎన్నికల సంఘం వాలంటీర్ల దగ్గర ఓటర్ల సమాచారు ఉన్న ఫోన్ల గురించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో వాలంటీర్లు ఓటర్లను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
