అమరావతిని ముందు అభివృద్ధి చేయాలి
బటన్లు నొక్కితే అభివృద్ధి అవుతుందా?
అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకె శైలజానాథ్
రాష్ట్ర విభజన తరువాత కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకె శైలజానాథ్ ప్రశ్నించారు. డిబిటి పేరుతో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బటన్లు నొక్కి నిధులు జమ చేస్తే అభివృద్ధి చేసినట్లా అని ధ్వజమెత్తారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతికి వచ్చి ఇంత మట్టి, నీరు ముఖాన కొట్టి మళ్ళీ రాజధాని ఊసు లేకుండా ఉన్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు కేంద్రం ముందు మోకరిల్లడం తప్ప నిధులు, హక్కులు సాధించుకోలేని స్థితిలో చేతులు ముడుచుకుని జీ హుజూర్ అంటున్నారని విమర్శించారు. రాజధానినే అభివృద్ధి చేయలేని జగన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవి అందుకోవడం విడ్డూరంగా ఉందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకె శైలజానాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర తో పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల అభివృద్ధి పై కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం దృషి సారించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 900 కిలో మీటర్లకు పైగా ఉన్న తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటకం ద్వారా వచ్చే నిధులను అభివృద్ధి కోసం వినియోగించాలని సూచించారు. విశాఖ-చెన్నై కోస్తా కారిడార్ ను అభివృద్ధి చేసి ఆ ఆదాయంతో ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. అప్పులు తెచ్చి పధకాలను అమలు చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలు ఏ పని చేయకుండా సోమరిపోతులుగా తయారు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రము చేస్తున్న అప్పుల భారం ప్రజలపైనే పడుతోందని వాపోయారు.
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి, తెలంగాణ ఏర్పాటుచేసేప్పుడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విభజన తర్వాత 13 జిల్లాలతో ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా సహాయకరంగా ఉండేందుకు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇచ్చారు. కేవలం 5 సంవత్సరాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదని, పరిశ్రమల ఏర్పాటు పుంజుకునే వీలు ఉండేలా 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని నాటి భాజపా పక్ష నాయకుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు వాదించారని పేర్కొన్నారు. ఇదే డిమాండును తిరుపతిలో జరిగిన ఎన్నికల హామీలో ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారని, ప్రణాళిక సంఘం స్థానే ఏర్పడిన నీతి ఆయోగ్ ఇందుకు అడ్డుచెప్పిందంటూ ఎన్డీయే ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదని తెలిపారు.
![](http://navandhra.com/wp-content/uploads/2022/06/logo13.png)