కోనసీమ అల్లర్ల వెనక ప్రభుత్వ పాత్ర ఉంది: జనసేన అధినేత పవన్కల్యాణ్
రాష్ట్రంలో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే తీరని నష్టమని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఒట్లు చీలకూడదనే పొత్తుల బాట అన్న ఆయన… బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా తానుంటాననేది కేవలం ప్రచారమేనన్నారు. కోనసీమ అల్లర్ల వెనక ప్రభుత్వ పాత్ర ఉందని జనసేన పవన్కల్యాణ్ ఆరోపించారు. జిన్నా పేరు విభజనతో ముడిపడి ఉందన్న పవన్…స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ముస్లిం నేతల్లో ఎవరో ఒకరిపేరు జిన్నాటవర్ సెంటర్కు పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
బీజేపీ, జనసేన మధ్య సమన్వయం లేదనుకోనవసరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నాయకులం అంతర్గతంగా మాట్లాడుకుంటూనే ఉన్నామని స్పష్టం చేశారు. భాజపా నుంచి జనసేన ఎలాంటి రోడ్డు మ్యాప్ తీసుకోలేదన్నారు. తాము కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఎలా ముందుకు వెళ్లాలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. మంగళగిరిలో ఆయన విలేకరులతో ముచ్చటించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆయన వెంట ఉన్నారు. వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు పవన్కల్యాణ్ స్పందించారు.
“హింసను ప్రేరేపించే ఏ ప్రభుత్వాన్నీ ప్రజలు ఇష్టపడరు. ఓట్లు వేయరు. ఉభయగోదావరి జిల్లాల్లో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. కోనసీమ అల్లర్లు కావాలనే చేశారని నాకు అనిపిస్తోంది. కేంద్ర నిఘావర్గాలు ముందే హెచ్చరించినా పోలీసులు పట్టించుకోపోవడం, ముఖ్యమంత్రి ఇంతవరకు దీనిపై స్పందించకపోవడం, డీజీపీ కూడా పట్టించుకోకపోవడం.. మంత్రులు ఎవరూ అక్కడికి వెళ్లకపోవడం చూస్తోంటే అదే అనిపిస్తోంది.
డీజీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు.”- పవన్
“ఒక సమస్యను మళ్లించడానికి మరో సమస్య. ఒక రాజధాని నిర్మించలేకపోతే మూడు రాజధానులు. దానిపై రగడ.. పక్కదోవ పట్టించడం, ఎమ్మెల్సీ అనంత్బాబు విషయాన్ని పక్కకు మళ్లించడానికి కోనసీమ అల్లర్లు. కోనసీమలో అంబేడ్కర్పై గౌరవం లేక కాదు. ఇది వారి పార్టీలో రెండు గ్రూపుల మధ్య వివాదం. బహుజన సిద్ధాంతానికి వ్యతిరేకంగా పన్నిన పన్నాగంలా అర్థమవుతోంది. ఇదంతా కావాలని చేసినట్లుగా అనిపిస్తోంది. ఒకవైపు కోనసీమ తగలబడుతోంటే బస్సు యాత్రలు చేస్తారా ? ఈ ఘటనలు ఏదో ఒక పార్టీకి మైనస్ కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్కు మైనస్. దీన్ని ఎవరైనా తమకు అనుకూలంగా, ప్లస్గా తీసుకుంటే వారు సమాజహితం కోరుకునే వారు కాదు. ఒకవేళ జనసేన వారే ఇందులో ఉంటే అరెస్టు చేయండి. ఆస్తుల విధ్వంసానికి బాధ్యుల నుంచి రికవరీ చేయించాలనే ఆలోచన మంచిదే. ముందు వైకాపా వారిని ఇందుకు బాధ్యులను చేయాలి. ఇప్పటికే వైకాపా కాపులను, బీసీలను, మత్స్యకారులను, కమ్మవారిని వర్గ శత్రువులుగా ప్రకటించింది. చివరికి వారికి ఇతరులెవరూ మిగలరు. శివసేన అధికార ప్రతినిధి మాట్లాడుతూ కోనసీమ అల్లర్లలో మోదీ ప్రమేయం ఉందని అన్నారు. ఇందులో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు. మోదీకి ఏ సంబంధం లేదు. వైకాపా తప్పులు చేసి కేంద్ర ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తోంది.” అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఆత్మకూరులో పోటీ చేయం:
చనిపోయిన కుటుంబంలోని వారిని ఎన్నికల్లో నిలబెడితే జనసేన పోటీ చేయడం లేదని పవన్ అన్నారు. ప్రస్తుతానికి ఇదే తమ విధానమని స్పష్టం చేశారు. ఆత్మకూరు ఉపఎన్నికలోనూ అదే పాటిస్తున్నామన్నారు.జిన్నా బదులు కలాం పేరు మేలు: “రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై వివరించేందుకు డీజీపీ అపాయింట్మెంట్ కోరాం. ఇంతవరకు ఇవ్వలేదు. ఇచ్చే వాతావరణమూ కనిపించడం లేదు. ఇవ్వకపోతే కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఆయనపై ఫిర్యాదు చేస్తాం. జిన్నా దేశ విభజనకు మూలకారకుడు. దేశ విభజన వల్ల లక్షలమంది చనిపోయారు. అనేకమంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. గుంటూరులోని జిన్నా టవర్కు ఆ పేరే కావాలని కోరుకునే వారు ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ అబ్దుల్ కలాం పేరో పెట్టడం మంచిది. సున్నిత అంశాల ఆధారంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వాటికి జనసేన మద్దతుగా నిలవదు. రామతీర్థం విషయంలో కూడా మేం ఎంతవరకు నిరసన వ్యక్తం చేయాలో అంతవరకే చేశాం. దోషులను శిక్షించాలి. కానీ సామాన్యులు, నిర్దోషులు ఇబ్బంది పడకూడదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.
భాజపా, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా మీరే ఉంటారన్న ప్రచారం జరుగుతోంది కదా.. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు పవన్ స్పందించారు.. ‘నేను గాల్లో మేడలు కట్టను. ఇదంతా ప్రచారం మాత్రమే’ అన్నారు. చంద్రబాబు మహానాడుకు ముందు జనసేనతో వన్సైడ్ లవ్ అని అన్నారు. మహానాడు తర్వాత వార్ వన్సైడు అంటున్నారు ఏమంటారు? అని ప్రశ్నిస్తే ‘సంతోషమే కదా’ అని పవన్ బదులిచ్చారు. నడ్డా రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా ఆయనను కలిసే అవకాశమేదీ లేదని చెప్పారు. సీఎం దావోస్ పర్యటన.. పెట్టుబడులపై స్పందిస్తూ.. కేవలం ఈ పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లడం ఖర్చుల దండగ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారులు, తదితరులపై వైకాపా నాయకులు చేస్తున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ.. ‘వాళ్ల అధినేత చరిత్రే అలంటిది కనుక కిందిస్థాయి నేతలు కూడా అదే బాటలో నడుస్తారు కదా’ అని అన్నారు.
తెలుగుదేశం పార్టీ కోసం ఢిల్లీకి పవన్ కళ్యాణ్?
తెలుగుదేశం పార్టీ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పయనమవబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తేదీ ఖారారవగానే ఆయన నాదెండ్ల మనోహర్తో కలిసి హస్తినాపురం వెళ్లనున్నారు. రాష్ట్రంలో అధ్వాన్న పరిపాలన, అభివృద్ధి లేకపోవడం, శాంతి భద్రతలు దిగజారిపోవడం, విలువల్లేని రాజకీయ పరిస్థితులు, కులాల మధ్య పోరు పెడుతున్న అధికార పార్టీ తదితర విషయాలను ఆయన వారితో చర్చించబోతున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. ఈనెల ఆరోతేదీ నుంచి రెండురోజుల పాటు భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించబోతున్నారు. అయితే ఆయనతో ఈ విషయాలు చర్చించడానికి, ఆయన్ను కలవడానికి పవన్ ఇష్టపడంలేదని సమాచారం. అయితే గతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సదర్భంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, పొత్తులుంటాయని, బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని పవన్కల్యాణ్ బీజేపీ నేతలను ఒప్పించే అవకాశం కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా బీజేపీతో తెలుగుదేశం పార్టీ వైరం పెట్టుకొని ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బీజేపీకి రాష్ట్రంలో సంస్థాగతంగా బలం లేకపోయినప్పటికీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబునాయుడు ఆసక్తి చూపిస్తున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీచేయడంవల్ల రాష్ట్రంలో అధికారాన్ని సులువుగా కైవసం చేసుకోవచ్చని, ఎంపీ సీట్లు కూడా అత్యధిక సంఖ్యలో వస్తాయంటూ కొన్ని సర్వేల వివరాలను మోడీ, అమిత్ షా ముందు పవన్ ఉంచబోతున్నారు.
ఎలాగైనా వైసీపీని ఓడించాలనే పట్టుదల!
జనసేన అధినేత ఎప్పటినుంచో రాష్ట్రంలో వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి ఆయన మానసికంగా సంసిద్ధులవడమే కాకుండా పార్టీ శ్రేణులను కూడా సిద్ధం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తామిద్దరికి జతకూడితే మరింత బలం చేకూరుతుందని, అందుకు మోడీని, అమిత్ షాను ఒప్పించగలనన్న ధీమాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసివెళ్లడం ఖాయమని నిర్థారించుకున్న అధికార పార్టీ పవన్ను లక్ష్యంగా ఎంచుకుందని జనసేన సైనికులు అంటున్నారు. అంతేకాకుండా పార్టీ శ్రేణులను భయపెట్టే విధంగా రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేస్తున్నారని, త్వరలోనే జనసేన తరఫున ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసి ఈ కేసులపై కోర్టులో సవాల్ చేయబోతున్నట్లు జనసేన పార్టీ కార్యాలయవర్గాలు వెల్లడించాయి.
పవన్ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు: నాగబాబు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పవన్ పోటీ చేయవచ్చునని తెలిపారు. పొత్తులపై తమ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని వివరించారు. పవన్ కల్యాణ్ పాదయాత్ర చేయరని.. కానీ ప్రభావంతమైన కార్యక్రమాన్ని చేపడతారని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని.. తాను పార్టీ సేవలకే పరిమితమని చెప్పారు.
వైకాపా నేతలు విశాఖ రుషికొండను మాయం చేయాలని చూస్తున్నారని నాగబాబు ఆరోపించారు. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ఎక్కడ ఏ కొండలు తవ్వేద్దామా ? అనే ధోరణితో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. చాలా చిన్న విషయాలకు జనసైనికులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలంగా ఉందన్న నాగబాబు.. త్వరలోనే బూత్ కమిటీలు వేసి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.పార్టీ అధ్యక్షుని నిర్ణయం మేరకే రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు ఉంటాయని తెలిపారు. తనకు పదవులపై వ్యామోహం లేదన్న నాగబాబు పార్టీలో ఓ కార్యకర్తగా ప్రయాణం కొనసాగిస్తానని తెలిపారు. మీడియా సమావేశం అనంతరం పార్టీ శ్రేణులతో నాగబాబు విడిగా భేటీ అయ్యారు. పరిచయ కార్యక్రమాల అనంతరం వివిధ అనుబంధ కమిటీల సభ్యులకు నియామక పత్రాలు అందించారు.
![](http://navandhra.com/wp-content/uploads/2022/06/logo13.png)