ప్రధాని నరేంద్రమోదీ జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధాని పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బీజేపీ కార్పొరేటర్లతో మోదీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీజేపీకి చెందిన 47 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని మోడీ ఢిల్లీలోని లోక్కల్యాణ్ మార్గ్లోని తన ఇంట్లో దాదాపు గంటన్నరపాటు సమావేశమయ్యారు. కార్పొరేటర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజానీకం బీజేపీ వైపు చూస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మనదేనని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీలో ఎక్కువ మంది మహిళలు గెలవడాన్ని ప్రధాని మోడీ అభినందించారు. 47 మంది బీజేపీ కార్పొరేటర్లలో 28 మంది మహిళలే ఉండడం గొప్ప విషయమన్నారు. దాదాపు గంటన్నరపాటు సాగిన సమావేశంలో ప్రతి కార్పొరేటర్తో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకొని వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని వారికి సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, ఈ దశలో మరింత కష్టపడితే ఈజీగా అధికారంలోకి వస్తామని చెప్పారు.
కార్పొరేటర్లకు రాజకీయ జీవితం ఇప్పుడే ఆరంభమైందని, కష్టపడితే భవిష్యత్లో మంచి నాయకులు అవుతారన్నారు మోదీ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని సూచించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వారికి చేరువ కావాలన్నారు. జూన్ 2, 3 తేదీల్లో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కోసం హైదరాబాద్కు వస్తానని, అప్పుడు మరిన్ని అంశాలు, ప్రజా సమస్యలపై చర్చిద్దామని కార్పొరేటర్లకు మోడీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పలువురు బీజేపీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణలో వారసత్వ దుష్పరిపాలనకు ముగింపు పలకడానికి, రాష్ట్రంలో సుపరిపాలన కోసం బీజేపీ పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రజా సేవలపై ఎలా దృష్టిసారించాలన్న దానిపై, క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయం అందించడంపై చర్చించామని ఆయన పేర్కొన్నారు.
అయితే మే 26న హైదరాబాద్ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చిన సందర్భంగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల నుంచి ఐఎస్బీ వద్ద స్వాగతం అందుకోవాలని నిర్ణయించారు. అయితే వర్షం కారణంగా అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే కార్పొరేటర్లను ఢిల్లీలో కలిసేందుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో వారు ఢిల్లీకి వెళ్లారు. ముందుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ను కలిశారు. ఆ తర్వాత కిషన్రెడ్డి నివాసంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు. కాసేపటికి బండి సంజయ్ రావడంతో ఆయనతో కలిసి నేతలంతా బస్సుల్లో ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లారు. సమావేశం అయ్యారు.
ప్రధాని మోదీకి కేటీఆర్ కౌంటర్
జీహెచ్ ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. ‘మోడీజీ, మీరు గవర్నమెంట్ ను నడుపుతున్నారా లేదా ఎన్జీవో నడుపుతున్నారా..? హైదరాబాద్కు వరద సాయం నిధుల్లో పురోగతి ఏది..? మూసీ నది పునరుద్ధరణ పనుల కోసం, లేదా హైదరాబాద్ మెట్రో పొడిగింపు కోసం ఏమైనా నిధులు ఇస్తున్నారా..? లేక ఐటీఐఆర్పై ఏదైనా అప్డేట్ ఉందా..? హైదరాబాద్, తెలంగాణకు మాటలు, గుజరాత్కు మాత్రం మూటలు’ అంటూ ట్విట్టర్లో కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.