రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ వారంలో కనీసం మూడు నాలుగు సార్లు అయినా ప్రభుత్వ విధానాలను, జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను కోర్టులు మందలించడం. వైకాపా ప్రభుత్వంలో కొండలా పెరిగిపోతున్న సలహాదారులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దేవదాయశాఖ సలహాదారుగా ఇటీవల ప్రభుత్వం నియమించిన జె.శ్రీకాంత్ జీవోను నిలుపుదల చేసింది. శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ జీవోపై స్టే ఇచ్చిన హైకోర్టు ఈ సందర్భంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది.మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉందిగానీ,శాఖలకు సలహాదారు ఏమిటని ప్రశ్నించింది.సలహాదారులను నియమించేందుకు అధికారుల కొరతేమైనా ఉందా అని నిలదీసింది.ఇలానే వదిలేస్తే రేపు అడ్వకేట్ జనరల్కూ సలహాదారుణ్ని నియమిస్తారని వ్యాఖ్యానించింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని కోర్టు ఆక్షేపించింది.
అనంతపురం జిల్లాకు చెందిన జ్వాలాపురం శ్రీకాంత్ను దేవాదాయశాఖ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఆగస్టు 5 ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు ఉంటారు. శ్రీకాంత్ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు. ఈ సమాఖ్యలో ఉండే ముగ్గురు విడిపోయి, దీన్ని మూడు ముక్కలు చేశారు.ఎవరికి వారు తమనే అధ్యక్షులుగా చెప్పుకొంటున్నారు. వారిలో శ్రీకాంత్ ఒకరు. ఈయన గత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్కు అనంతపురం నగరపాలక సంస్థ పరిధి సమన్వయకర్తగా కొంతకాలం ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపాలోకి వెళ్లారు. ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖను శాసిస్తున్న ఓ కీలక స్వామీజీకి ఈయన చాలాకాలంగా ముఖ్యమైన శిష్యుడు.గతంలో ఆయన్ను అనంతపురానికి ఆహ్వానించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సిఫార్సు ద్వారా తొలుత తితిదే బోర్డు సభ్యుని పదవి కోసం ప్రయత్నించారని తెలిసింది. ఆ అవకాశం రాకపోవడంతో సలహాదారు పదవిపై దృష్టి పెట్టారు. చాలాకాలంగా ఈ ఫైల్ పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకు లభించిన అధికారంతో ఇష్టమొచ్చినట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎక్కడా లేని ఇష్టమొచ్చిన పోస్ట్లు క్రియేట్ చేసి వందిమాదుగులకు కట్టబెడుతూ వస్తుంది. రాజ్యాంగ పరిరక్షణకు కోర్టులు ఉండి సరిపోయింది గానీ లేకపోతే వీరి అరాచకాలకు అంతు లేకుండా పోయేది అని ప్రజలు అనుకుంటున్నారు.