రాజ్యసభ స్థానాలకు పారిశ్రామికవేత్తలకు గులాబీ పార్టీ పెద్దపీట వేసింది. రాజ్యసభకు వెళ్లనున్న టీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, సీఎం కెసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, హెటిరో ఛైర్మన్ బండి పార్థసారథిరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా తెరాస నేత, గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)ని అభ్యర్థులుగా ఆయన ప్రకటించారు. ప్రగతిభవన్లో వారికి బి-ఫారాలను అందజేశారు. వీరిలో ఎమ్మెల్సీగా ఎన్నికై రాజీనామా చేసిన బండా ప్రకాశ్ స్థానం కోసం జరగనున్న ఉపఎన్నికకు మే 19న వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ వేయనున్నారు. రెండేళ్ల పదవీ కాలం ఉంది. గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ప్రకాశ్ సైతం వరంగల్ జిల్లా వారే. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ల పదవీ విరమణతో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు దామోదర్రావు, పార్థసారథిలు నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 24 నుంచి 31 వరకు గడువు ఉంది. మూడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా కేసీఆర్ ముమ్మర కసరత్తు చేశారు. ఉద్యమ సహచరుడైన దామోదర్రావు, పారిశ్రామికవేత్త పార్థసారథిరెడ్డి, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్రలను పెద్దల సభకు పంపాలని గులాబీ బాస్ నిర్ణయించారు.
బండి పార్థసారథిరెడ్డి
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పార్థసారథిరెడ్డి డిగ్రీ అనంతరం ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూనే హెటిరో సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఇప్పుడు దేశంలోని టాప్ 10 కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. 18 వేల మంది యువతకు ఉద్యోగాలిచ్చింది. హెటిరో సంస్థ బాధ్యతలను నిర్వహిస్తూనే.. భారత ప్రభుత్వానికి చెందిన డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్, బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2017లో ఇచ్చిన బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు పొందారు.
దీవకొండ దామోదర్రావు
సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆయన వెంట నడిచిన వ్యక్తుల్లో ఒకరు. 2001 నుంచి తెరాసలో పలు హోదాల్లో పని చేశారు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికల వ్యవస్థాపనలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ పబ్లికేషన్స్ (నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు)కు ఛైౖర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా వ్యవహరిస్తున్నారు.
వద్దిరాజు రవిచంద్ర
గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర మున్నూరు కాపు ఆల్ అసోసియేషన్ జేఏసీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. తన సొంతూరులో బడి, గుడి, రహదారి, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలను కల్పించారు. మేడారం ఆలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సాయం చేశారు.