హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు మార్చడం మీద అనేక వర్గాలతో పాటు వైఎస్సార్సీపీ లోనూ వ్యతిరేకత కనపడుతుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి కనిపిస్తోంది. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు. దేనికైనా వైఎస్సార్ పేరు పెడితే తనకు అభ్యంతరం లేదని కానీ, యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరును తొలగించడం సరికాదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యానని అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగుగంగ ప్రాజెక్టుకు ‘ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు’గా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నామకరణం చేశారని యార్గగడ్డ గుర్తు చేశారు. అందుకే తనకు రాజశేఖర్ రెడ్డి అంటే అంత గౌరవమని అన్నారు. చంద్రబాబుపై తనకు కోపం ఉండటానికి కారణం టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆయన వెళ్తున్నారని అన్నారు. టీడీపీని నడిపించే శక్తి చంద్రబాబుకే ఉందని తాను ఆనాడే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెపుతున్నానని తెలిపారు. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని అలాంటి కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకురాలేదని కానీ, చంద్రబాబు తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు.
తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైసీపీ లో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పేరు మార్పుపై స్పందించారు. అయితే ఆయన యార్లగడ్డ స్థాయిలో రియాక్ట్ అవలేదు. ముఖ్యమంత్రి జగన్ ఎంతో పెద్ద మనసుతో నందమూరి తారక రామారావు పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇవ్వని గుర్తింపు ఇచ్చి స్పూర్తిగా నిలిచారని గుర్తు చేసారు.ఎన్టీఆర్ చొరవతో ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణజన్ముడైన ఆ మహానీయుడు పేరు కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని వల్లభనేని వంశీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్ పేరు మార్చటం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట గలపటమేనని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చేందుకు ఎన్టీఆర్ పడిన తపన గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు.