నిన్నటి రోజున జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి మంత్రుల పనితీరు మీద విమర్శలు చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు సరిగా కౌంటర్లు ఇవ్వడం లేదు. ఇలా అయితే కొత్తవారిని మంత్రులుగా తీసుకోవడానికి వెనకాడను అని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. ఏపీలో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలక బోతున్నారు అని వైఎస్ఆర్సీపీ వర్గాలు మీడియాకు లీక్లు ఇవ్వడం మొదలు పెట్టాయి. కేబినెట్ సమావేశంలో జగన్ తన కుటుంబంపై టీడీపీ ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఇలా అయితే ఇద్దరు, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తానని హెచ్చరించారు. ఆ మాటలు అన్న తర్వాతి రోజే ముగ్గురు మంత్రులకు ఉద్వాసన ఖాయమని ప్రచారం ప్రారంభం అయ్యింది. ముగ్గురు ఎవరో కూడా ఖరారయిందని ఒకరు మహిళా మంత్రి అని చెబుతున్నారు. నవంబర్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని వైసీపీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి.
సీఎం జగన్ గత ఏప్రిల్లోనే కేబినెట్ మంత్రులందరితో రాజీనామాలు చేయించి కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. అందులో పదకొండు మంది పాతవారికే తిరిగి అవకాశం కల్పించారు. అవకాశం పోయిన వాళ్లలో పేర్ని నాని, కొడాలి నాని లాంటి నోరున్న నేతలున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత వారు సైలెంటయ్యారు. వారి ప్లేస్లో మంత్రి పదవులు చేపట్టిన వారు సైలెంట్గా ఉంటున్నారు. మంత్రుల్లో గట్టి వాయిస్ ఉన్న వారు లేరు. రోజా ఉన్నప్పటికీ ఆమె విమర్శల ద్వారా పార్టీ కి ప్లస్ కన్నా మైనస్సే ఎక్కువ జరుగుతుంది అనుకుంటున్నారు. ఇతర మంత్రులు నోరు తెరవడం లేదు. దీంతో జగన్ అసహనానికి గురువుతున్నారు.
సీఎం జగన్ హెచ్చరించిన తర్వాత కూడా మంత్రులు బయటకు వచ్చి టీడీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేస్తారనుకుంటే అలాంటిదేమీ కనపడలేదు. ముఖ్యమంత్రి కుటుంబం జోలికి టీడీపీ ఎందుకు రావడం అని బొత్స ఒక్కరే స్పందించారు. మిగతా మంత్రులు మాట్లాడలేదు. దీంతో ఉదయమే ముగ్గుర్ని తొలగించబోతున్నట్లు నవంబర్లో ముహుర్తం ఫిక్స్ చేసినట్లు లీక్ ఇచ్చారు. అయితే అత్యధిక శాతం మంత్రులు మాత్రం.. మీడియా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు.