జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుండి ఉన్న పెద్ద అపవాదు పంచాయితీ నిధుల మళ్లింపు. ఇప్పుడు పంచాయతీల ఆదాయాన్ని విద్యుత్ బకాయిలకు మినహాయించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కాగ్ వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్లోని ప్రత్యేక బిల్లుల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 48,284.31 కోట్ల రూపాయల చెల్లింపులు జరిపారని కాగ్ తప్పుబట్టింది. సీఎఫ్ఎంఎస్ బ్యాక్ ఎండ్ ద్వారా ప్రాసెస్ చేశారని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైనట్లు పేర్కొంది. ఈ ప్రత్యేక బిల్లులను పరిశీలిస్తే అనేక లోపాలు వెలుగుచూశాయని నివేదిక తెలిపింది.
ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ సేకరించిన 10, 895.67 కోట్ల రుణాలను 15 ప్రత్యేక బిల్లుల ద్వారా ఉపసంహరించి రాష్ట్ర సంఘటిత నిధికి తిరిగి సర్దుబాటు చేశారన్న కాగ్ అదే మొత్తాన్ని ఏపీఎస్డీసీ పీడీ ఖాతా నుంచి మూడు ప్రత్యేక బిల్లుల ద్వారా 8 కార్పొరేషన్ల పీడీ ఖాతాలకు బదిలీచేశారని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో పీడీ ఖాతాలకు పెద్దమొత్తంలో నిధులను బదిలీ చేసినట్లు చూపుతున్నా ఆ నిధులు అక్కడ లేకపోవడంతో వాటిని సిబ్బంది ఖర్చు చేసుకోలేకపోతున్నారని, ఒకవైపు రాష్ట్రంలో భారీగా రెవెన్యూ లోటు కనిపిస్తుంటే మరోవైపు బడ్జెట్ కేటాయింపుల్లో మూడోవంతు పీడీ ఖాతాల్లో మిగిలిపోయినట్లు చూపుతున్నారని కాగ్ తప్పుబట్టింది.
సంఘటిత నిధి నుంచి నిధులను పీడీ ఖాతాలకు బదిలీ చేసి, ఆ నిధులు ఖర్చు చేయకపోవడంతో ఖర్చు ఎక్కువ చేసి చూపినట్లవుతోందని తెలిపింది. వీటిపై శాసనపరమైన పరిశీలన లోపించిందన్న కాగ్ బడ్జెట్ ప్రక్రియ పవిత్రతను కాపాడుకునేందుకు పీడీ ఖాతాలను తగ్గించడం అవసరమని పేర్కొంది. రాష్ట్ర పథకాలు, కార్యకలాపాల అమలుకు పీడీ నిర్వాహకుల వద్ద నిధులను ఉంచడం ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్కు విరుద్ధమని కాగ్ స్పష్టం చేసింది.