ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మొట్టికాయలు తినడం అలవాటుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. గ్రేడ్ 2 ఎక్స్ టెన్షన్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఆపివేస్తు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 నియామకాలు తాత్కలికంగా నిలిచిపోనున్నాయి.
రాష్ట్రంలో 560 గ్రేడ్-2 పోస్టులకు గాను నియామకాలకు ఇటీవల ప్రభుత్వం జీవో ఇచ్చింది. 38వేల మంది అంగన్ వాడీ టీచర్లు ఇటీవల రాత పరీక్షలు రాశారు. మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే కొందరిని సెలెక్ట్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కొందరు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.
పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం 50 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని శ్రవణ్ కుమార్ వాదించారు. వీటిలో 45 మార్కులకు రాత పరీక్ష, 5 మార్కులకు మౌఖిక పరీక్ష నిర్వహించాలన్నారు. అయితే రాత పరీక్ష నిర్వహించిన అధికారులు మౌఖిక పరీక్ష నిర్వహించకుండానే కొందరిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నారని, ఉద్యోగాల భర్తీల్లో అవకతవకలు జరిగాయని ఆయన కోర్టుకు తెలిపారు.
రెండు రోజుల క్రితం మహిళ, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించి అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీ లోపు అంగన్వాడీ కేంద్రాల సూపర్ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని సీఏం సమీక్షా సమావేశంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నామని అధికారులు కూడా తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామని తెలిపారు. అయితే నియామకాల ప్రక్రియను పూర్తిచేయడానికి సీఏం విధించిన గడువుకు ఒక రోజు ముందు ఈ నియామకాల ప్రక్రియను తాత్కలికంగా నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీచేసింది.