రైల్వే జోన్ రాష్ట్రాల స్థాయిలో కాదని కేబినెట్కు వదిలేయాలని హోంశాఖ కార్యదర్శి తెలిపారు.తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక సమావేశం ముగిసింది. రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే బోర్డు తేల్చి చెప్పింది. రాజధానికి మరో రూ.1000 కోట్లు కావాలని ఏపీ అధికారులు కోరగా ఇప్పటికే ఇచ్చిన రూ.1500 కోట్ల ఖర్చుల వివరాలు ఇవ్వాలని హోంశాఖ ఆదేశించింది. రాజధానికి రూ.29 వేల కోట్లు ఇవ్వాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని కమిటీ చెప్పిన విధంగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరారు. నిధుల విషయంపై హోంశాఖ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేదని అధికారులు తెలిపారు.
ఏపీ లేవనెత్తిన ఏ ఒక్క విషయంలోనూ తెలంగాణ అంగీకారం తెలపలేదు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహా పలు సంస్థల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ తెలిపింది. పౌర సరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలు ఉన్నాయని ఏపీ అధికారులు చెప్పారు. విద్యుత్ బకాయిల అంశం సమావేశంలో చర్చకు రాలేదని అధికారులు తెలిపారు. విభజన సమస్యలపై ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. మరోసారి భేటీ కావాలా, వద్దా అన్న నిర్ణయం లేకుండానే సమావేశం ముగిసింది.
అలాగే వెనకబడిన 7 జిల్లాలకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరగా ఐదేళ్లే ఇవ్వాలని నిర్ణయం జరిగిందని హోంశాఖ అధికారులు స్పష్టం చేశారు. షీలా బిడే కమిటీ సిఫార్సులపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. కమిటీ సిఫార్సులను తెలంగాణ ఒప్పుకోవట్లేదని హోంశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ అంగీకరించకపోయినా హోంశాఖ నిర్ణయం తీసుకోవచ్చు కదా అని ఏపీ అధికారులు కోరారు. న్యాయ నిపుణుల సలహా తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రం తెలిపింది.