రాబోయే ఎన్నికల్లో పార్టీల మధ్య పొత్తులపై చంద్రబాబు స్ఫష్టతనిచ్చారు. రాష్ట్రం ప్రయోజనాల కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటివరకు పొత్తుల గురించి నేనవరి దగ్గర మాట్లాడలేదని,పొత్తుల గురించి నాయకుల్లో స్పష్టత ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర పునఃనిర్మాణం కోసం చేసే కార్యక్రమాలకే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పోలీసులు లేకుండా వస్తే అధికార పార్టీ నో, తెలుగుదేశం పార్టీనో తేల్చుకునేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి జగన్కు చంద్రబాబు సవాల్ విసిరారు. త్వరగా ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టి పీడ వదిలిపోతుందని నెత్తిన ఉన్న దరిద్రాన్ని ఎప్పుడు దించుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి రూ.2లక్షల కోట్లు దాటిపోయిందని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ పేరు చెప్తేనే వైకాపా వెన్నులో వణుకు మొదలవుతోందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో పోరాడేవారు తయారు కావాలని,వారిని పార్టీలో ఉన్నపెద్ద మనుషులు తయారు చేయాలని సూచించారు. న్యాయబద్ధంగా, రాజకీయంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు “క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్” నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ముఠా రాజకీయలు, ఫ్యాక్షనిజాన్ని అంతం చేసిన ఘనత తెలుగుదేశానిదేనని గుర్తు చేశారు. వ్యవస్థలు నాశనం కావటంతో రాష్ట్రంలో వైకాపా నేతలకు కూడా భద్రత లేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఆస్తులు పెరిగి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. అవినీతిని క్రమబద్ధీకరిస్తున్నారనటానికి లేపాక్షి భూముల వ్యవహారమే సజీవ ఉదాహరణ అని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ప్రజల ఆదాయం పెరగలేదు కానీ వైకాపా నేతల ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగిందని విమర్శించారు. సొంత సంస్థలకు ఇష్టానుసారం కేటాయింపులు, అనుమతులు ఇస్తున్నారని ఆక్షేపించారు. మూడున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో విజన్ లేని విధ్వంసమే ఎక్కువని, ఒక్కో కుటుంబంపై రూ. 3.25లక్షల అదనపు ఆర్థిక భారం వేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేయటంతో ఏ సర్పంచ్ కూడా ఆనందంగా లేరని వాపోయారు.