ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాల హాజరును నేటి నుంచి ఉపాధ్యాయులు యాప్ ద్వారానే నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు మినహాయించి మిగతా వారంతా యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. బోధనేతర సిబ్బందికీ ఎలాంటి మినహాయింపులేదని తేల్చిచెప్పింది. మాన్యువల్ అటెండెన్సును పరిగణనలోకి తీసుకోమని, చూపులేని దివ్యాంగులకు మాత్రమే వెసులుబాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆండ్రాయిడ్ ఫోన్లు లేని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ప్రధానోపాధ్యాయుడు ఫోన్లను వినియోగించుకోవాలని సూచించింది. ఐతే ఫేస్ ఆధారిత హాజరు నమోదు యాప్ డౌన్లోడ్కు ఉపాధ్యాయ సంఘాలు నిరాకరిస్తున్నాయి.
వ్యక్తిగత డేటా భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం తినే పిల్లల హాజరు, మరుగుదొడ్ల శుభ్రత, విద్యాకానుక, ‘నాడు-నేడు’పనుల వివరాలను టీచర్లు సొంత ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్న యాప్ల్లో నమోదు చేస్తున్నారు. ఇదే తమకు భారమని, మళ్లీ కొత్త యాప్ డౌన్లోడ్ తమ వల్ల కాదని ఉపాధ్యాయులు నిరాకరిస్తున్నారు.యాప్ లో హాజరు నమోదుపై ప్రభుత్వం తొలుత ఆగస్టులోనే మార్గదర్శకాలు జారీ చేసినా ఉపాధ్యాయులు వ్యతిరేకించడంతో మంత్రి బొత్స గత నెల 18న వారితో చర్చలు జరిపారు. కానీ అవి విఫలం అయ్యాయి. ఉదయం 9గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సెలవు నిబంధన తొలగిస్తామని 15రోజులు ఈ-హాజరుపై శిక్షణ ఇస్తామని మంత్రి వారికి నచ్చజెప్పారు. ప్రభుత్వమే డివైజెస్ కొనుగోలు చేసి ఇవ్వాలంటే దాదాపు 200 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. ఐతే ఉపాధ్యాయులు మాత్రం హాజరు పరికరాలను ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.నేడు మంత్రితో జరిగే చర్చల ఆధారంగా క్షేత్రస్థాయిలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.