తెలంగాణ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు సరికాదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని సూచించారు. ఏపీకి అమరావతినే రాజధానిగా ఉండాలనేది కాంగ్రెస్ నిర్ణయమని పేర్కొన్నారు.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు సరికాదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని సూచించారు. అదే అధికారంలో లేనప్పుడు ఎలా నడుచుకున్నా ఎవరూ పట్టించుకోరని అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిల పాదయాత్ర నాయకులను తిట్టేందుకు చేస్తున్నారా? నేతలపై వ్యక్తిగతంగా బురద చల్లితే ఎలా? మా దగ్గర కూడా అలాంటివి చాలా ఉంటాయి. వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె అయినంత మాత్రాన విమర్శిస్తే ఊరుకుంటామా? తండ్రి బాటలో షర్మిల నడవడం లేదు. ఇంతవరకు ఆమె భాజపాను విమర్శించినట్లు చూడలేదు. ప్రధాని మోదీని షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదు?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.