విద్యా హక్కు చట్టం విషయంలో ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా ప్రైవేటు పాఠశాలలకు పరోక్షంగా సాయపడుతుండడమే కాకుండా పేదవిద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వారి వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఇచ్చినట్టు చూపించకుంటే జైలుకు పంపాల్సి వస్తుందని ఏపీ సీఎస్, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను హెచ్చరించింది. అంతేకాదు, ‘‘విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి.. లేదంటే మీరు జైల్లో అయినా ఉండాలి’’ అని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలంటూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో ధిక్కరణ వ్యాజ్యం వేశారు. తాజాగా ఈ కేసు మరోమారు విచారణకు రాగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.ఎంతమంది పేద పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారో వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఆ వివరాలతో తాము సంతృప్తి చెందకుంటే వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తామని సీఎస్ ను హెచ్చరించింది.
రాష్ట్రంలో 16 వేల ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని, ఒక్కో పాఠశాలలో కనీసం ఐదుగురు పేద పిల్లలకు ఉచితంగా సీట్లు కేటాయించినా మొత్తం 80 వేల మంది చిన్నారులకు ఉచితంగా చదువుకునే అవకాశం లభించి ఉండేదని యోగేశ్ వాదించారు. స్పందించిన ప్రభుత్వ న్యాయవాది నాగరాజు ప్రభుత్వ వాదనలు వినిపిస్తూ సీట్ల భర్తీ ప్రక్రియను సిద్ధం చేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నట్టు చెప్పారు.