గురువారం కృష్ణా జిల్లా పెడనలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఒక మగ్గం మార్చేసిందని, చేనేత కార్మికులను ఆదుకొనేందుకు గతంలోని ప్రభుత్వాలు వారికి అండగా నిలవలేదని అన్నారు. తన 3 వేల కిలో మీటర్లకు పైగా చేసిన పాదయాత్రలో నేతన్నల జీవితాలను గమనించానని,వారికి తాను ఉన్నాననే భరోసా కల్పించేందుకు అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమల్లోకి తెచ్చామని వివరించారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ.ఇరవై నాలుగు వేలు సాయాన్ని గత మూడేళ్ల నుంచి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు నాలుగో ఏడాది కూడా రూ.24 వేలను బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. ఇలా నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి రూ.తొంబై ఆరు వేల సాయం చేస్తున్నట్లుగా చెప్పారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనుకూల మీడియా సంస్థలు, దత్తపుత్రుడి కోసమే పని చేశారని అన్నారు. అప్పుడు రాష్ట్రంలో దోచుకో, తినుకో, పంచుకో పథకం నడిచిందని ఎద్దేవా చేశారు. తప్పుడు వార్తలు రాయడం,ప్రచారం చేయడమే ఇప్పుడు వాళ్లు పనిగా పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని ఆవేదన చెందారు.
పెడన లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను సీఎం జమ చేశారు. దీంతో ఇప్పటివరకూ నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని జగన్ అన్నారు. ఫ్లిప్ కార్ట్, ఆమెజాన్, మింత్రా వంటి ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా మార్కెటింగ్ చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసిన ప్రభుత్వం తమదేనని అన్నారు. ఇప్పటివరకు చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.2,049 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా సాయం అందించలేదని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.