మూడు రాజధానులు వ్యతిరేకంగా, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని అమరావతి రైతులు తలపెట్టిన ఉద్యమం 1000 రోజులు పూర్తి కావస్తున్న సందర్భంగా రైతులు తలపెట్టిన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలి అని చూస్తుంది.సెప్టెంబర్ 12న నిర్వహించే పాదయాత్రకు అనుమతి కోరుతూ హైకోర్టులో అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి నుంచి అరసవెల్లికి వరకు పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాదయాత్ర అనుమతి కోసం డీజీపీకి దరఖాస్తు చేసింది. రైతులు వేసిన పిటిషన్పై ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది.
రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని అమరావతి ఐకాస నాయకులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు యాత్ర సాగుతోందని వెల్లడించారు. ప్రతి ఎనిమిది రోజులకోసారి సెలవు ప్రకటించారు. గుంటూరు, కృష్ణా, ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖ, విజయనగరం మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయం వరకు యాత్ర సాగనుందని అమరావతి ఐకాస నాయకులు తెలిపారు. యాత్రను విజయవంతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పాదయాత్ర అనుమతి కోసం ఐకాస నేతలు ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అందించారు.
1000 రోజులు సమీపిస్తున్నా ప్రభుత్వంపై రాజధాని రైతుల పోరాటం ఆగలేదు. దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వడం లేదు మారింది రైతులు, ఆ ప్రాంత ప్రజల పరిస్థితి. కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా, ఎన్ని చీవాట్లు పెట్టినా మళ్లీ ఏదో ఒక రూపంలో మూడు రాజధానుల అంశాన్ని ఎత్తు తున్నారు అధికార పార్టీ వారు. కానీ రైతులు, రాజధాని ప్రజలు మాత్రం తమకు ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం సెప్టెంబరు 12కి వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా మహా పాదయాత్ర చేపట్టనున్నారు.