వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారుల తో కలిసి వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు.ఆరోగ్య శ్రీ పేషెంట్ల తరహాలోనే రోజుకు రూ.100కు పెంచాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తోన్న ఆహారం, నాణ్యతపై ముఖ్యమంత్రి చర్చించారు. మరింత రుచికరమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ డైట్ ఛార్జీలను పెంచాలని సీఎం ఆదేశించారు. నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ ఇవ్వాలని సీఎం సూచించారు.
ప్రస్తుతం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉండగా కొత్త వాటి చేరికతో 3,254కు చికిత్సల సంఖ్య చేరనున్నట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు మూడు రెట్లు పెరిగిందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీకి సుమారుగా 2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు 300 కోట్లు 108,104ల కోసం సుమారు మరో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా దాదాపు 3, 200 కోట్లు వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104ల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి మరో 432 కొత్త 104 వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 676 వాహనాలు సేవలందిస్తుండగా కొత్తవి చేరితే వాటి సంఖ్య 1108కి చేరనుంది. అలాగే ఇప్పటికే సేవలందిస్తున్న 748, 108 వాహనాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
విలేజ్ క్లినిక్స్లో 12 రకాల వ్యాధి నిర్ధారణ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు సీఎం కు వివరించారు. కొవిడ్ కిట్ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం నిర్దేశించారు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన స్థాయిలో సిబ్బంది ఉండాలని సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రతినెలా ఆస్పత్రుల వారీగా ఆడిట్ చేయాలని, ఆ నివేదికలు అధికారులకు చేరాలన్నారు. క్రమం తప్పకుండా దీన్ని పర్యవేక్షించాలని సూచించారు.జూనియర్ డాక్టర్ల స్టై ఫండ్ పెంపుపైనా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీలోకి కొత్త చికిత్సల చేరికలపై ప్రగతిపై సీఎం ఆరా తీశారు. వైయస్సార్ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సల చేరిక దాదాపు ఖరారు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.