ఇటీవల నారా లోకేష్ తాను సాఫ్ట్ కాదని, రఫ్ అని చెప్పుకుంటున్నారని, ఆయన గడ్డం పెంచినంత మాత్రాన ఏమవుతుందని,నేను చాలా హాట్ గురూ అంటున్న లోకేష్ తో టీడీపీకి ఉపయోగం లేదని అసలు లోకేష్ కి సబ్జెక్టే లేదన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.నారా లోకేష్ పై గతంలో బాడీ షేమింగ్ తరహాలో కామెంట్లు విసిరేవారు వైసీపీ నాయకులు. ఇటీవల ఆయన స్లిమ్ముగా మారిన తర్వాత ఈ కామెంట్లు పూర్తిగా మాయం అయిపోయాయి. మంత్రి కాకాణి కూడా నారా లోకేష్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. లోకేష్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని అంటూనే గడ్డం పెంచి, మీసం పెంచి జనాల్లోకి వచ్చినంత మాత్రాన సరిపోతుందా అంటూ సెటైర్లు వేశారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు కాకాణి గోవర్దన్ రెడ్డి. టీడీపీ హయాంలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారంటూ తప్పుడు కథనాలు రాయించారని, అసలు టీడీపీ హయాంలో మెడికల్ కాలేజీలు రాలేదని,ఎవరో మొదలు పెట్టినవాటిని, తమ హయాంలో రిబ్బన్ కట్ చేసి సోకులు చేసుకోవడం చంద్రబాబుకి అలవాటేనన్నారు. ఆయన జీవితంలో ఎప్పుడూ నిజాలు చెప్పలేదని అన్నారు.
చంద్రబాబు వచ్చేదఫా కుప్పంలో పోటీ చేసే పరిస్థితి లేదన్నారు కాకాణి. ఆయన అక్కడినుంచి పారిపోతారని జోస్యం చెప్పారు. కుప్పంకి చంద్రబాబు చేసిందేమీ లేదని, మున్సిపాల్టీ ఎన్నికల్లో ఓటమితోనే చంద్రబాబుకి భయం వేసిందని అందుకే అసెంబ్లీలో తనని ఎవరో ఏదో అన్నారంటూ మొసలి కన్నీరు కార్చారని చెప్పారు. అలా కవర్ చేసుకోవాలని చూసినా ఎవరూ నమ్మలేదన్నారు. సీఎం జగన్ కుప్పంకి వెళ్తే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చే దఫా అక్కడ భరత్ కచ్చితంగా గెలుస్తారని చెప్పారు.