ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కౌంటర్లు, ఎన్కౌంటర్ లతో వేడెక్కింది. ముఖ్యంగా జనసేన అధినేత మీదకు అధికార వైసీపీ నేతలు ఒంటి కాలుతో వచ్చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే నవ్వొస్తోందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైసీపీకి 45 సీట్లు వస్తాయన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. నిన్న వీకెండ్ బై పీకే చూశామని, ఆదివారం వచ్చి అజ్ఞానంగా మాట్లాడిపోతుంటారని ఎగతాళి చేశారు. వైసీపీకి 45 సీట్లు వస్తాయన్న సర్వేల వల్లే గతంలో బోర్లాపడ్డారని విమర్శించారు. వైసీపీకి 45 సీట్లు వస్తాయంటే జనసేనకు 130 సీట్లు వస్తాయా అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ కు మంత్రి రోజా ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే 175 సీట్లలో జనసేన సింగిల్ గా పోటీచేయాలని ఛాలెంజ్ చేశారు. లోకేశ్ పాదయాత్ర పోస్ట్ పోన్ చేయగానే పవన్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారని ఆరోపించారు. దీన్ని బట్టి అర్ధమవుతోంది లోకేశ్ , పవన్ ఒకే గూటి పక్షులు అని అన్నారు. సినిమా డైలాగులు చెప్పడం మానుకోవాలని హితవుపలికారు. పందులన్నీ ఒకచోట చేరి జగనన్నను ఓడిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ గడ్డ జగనన్న అడ్డా అంటూ మంత్రి రోజా సినిమా డైలాగ్స్ చెప్పడం హైలైట్. అధికారదాహంతోనే లోకేశ్ ను చంద్రబాబు మంత్రి చేశారని విమర్శించారు.
పనిలో పనిగా మంత్రి రోజా చంద్రబాబును విమర్శిస్తూ “టీడీపీ నేతలకు అసలు సిగ్గు అనేది ఉందా? చంద్రబాబు రైతు ద్రోహి,రైతులకు మంచి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు విమర్శించడం సిగ్గుచేటు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రైతులకు చేసింది అసలేమీ లేదు. చంద్రబాబు, వైఎస్ జగన్ కు మూడున్నర లక్షల కోట్లు అప్పులను ఇచ్చి పోయాడు. రైతులకు అండగా నిలబడింది వైసీపీ ప్రభుత్వం. వ్యవసాయ అనుబంధ రంగ వృద్ధి రేటు పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేసిందో రైతులు తెలుసుకోవాలి. అసెంబ్లీలో టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. కరవుకు గడ్డం పెడితే అది చంద్రబాబు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. వరుణుడు వైఎస్ఆర్ కుంటుంబంలో సభ్యుడిగా మారాడు” అని అన్నారు.