ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు అధికార వైసీపీ మీద విమర్శల జోరు నెమ్మదిగా పెంచుతున్నారు. తాజాగా దేశంలో అసెంబ్లీ సమావేశాలు అతి తక్కువ రోజులు జరిగిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే నని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి లేజిస్లేటివ్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని అన్నారు. ఇక, అసెంబ్లీ వేదికగా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్సీ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు, ఉపాధి లేక రాష్ట్రం నుంచి వలసలు వెళ్లిపోయే దుస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. అయితే, అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని బీజేపీ స్పష్టంగా చెబుతోందని మరోసారి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ రాష్ట్రంలోని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామంటూ అధికార వైసీపీ పార్టీ నాయకులు తేల్చి చెబుతున్న ఈ తరుణంలో త్వరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసింది.