జగన్ సర్కార్ అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు, ఆర్టీసీ ఉద్యోగులను కూడా మోసం చేసింది అంటున్నారు. ప్రభుత్వంలో విలీనం అనగానే ఎగిరి గంతేశారు. సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇవ్వగానే సంబరపడిపోయారు. జీతాల పెంపు కోసం ఆశగా ఎదురుచూశారు. కాలం గడుస్తున్నా ఇప్పటికీ విలీన ఫలితాలు ఆర్టీసీ ఉద్యోగులకు దక్కలేదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగినా ఇప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెరగలేదు. సాంకేతిక సమస్యల పేరిట ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వానికి తుదిగడువు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.
ఆర్టీసీలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు చాలా ఏళ్లుగా ఒరాకిల్ సాఫ్ట్వేర్ వాడుతుండగా ప్రభుత్వంలో మాత్రం CMFS ద్వారా అందిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగులను CMFSలో చేర్చలేదు. సాఫ్ట్వేర్లను లింక్ చేయాలంటూ జూన్ 6న, 26న రెండుసార్లు ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు ఆర్టీసీ ఎండీ లేఖ రాసినా పట్టించుకోలేదు. జూన్ 29న నేరుగా CMFS సీఈవోకు లేఖ రాసినా ఫలితం లేదు. ఈ పరిస్థితుల్లో జులై 1 న ఉద్యోగులు పాత వేతనాలే తీసుకున్నారు. ఆ తర్వాత తీరిగ్గా రెండు సాప్ట్వేర్లను లింక్ చేయడం కుదరదని, ఆర్టీసీ ఉద్యోగులు సీఎంఎఫ్ఎస్ లోకే రావాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. దీనికోసం డీడీవోలు ఏర్పాటు చేయాలని తేల్చింది. ఈ మార్పు కోసం అన్నీ సిద్ధం చేసినా ఆర్థికశాఖ పదేపదే కొర్రీలు వేయడం వల్ల ఆగస్టు 1న కూడా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు రాలేదు. 48 మందికి స్టేట్ కేడర్ పదోన్నతులు ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ పీఆర్సీ దస్త్రాన్ని ఆర్థిక శాఖ మరోసారి ఆపేయడంతో సెప్టెంబర్ 1వ తేదీన పాత జీతాలే అందుకున్నారు.
రెండున్నరేళ్ల క్రితం ఆర్టీసీ ఉద్యోగులపై ముఖ్యమంత్రి జగన్ వరాలు కురిపించారు. 2020 జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న విధంగానే ఆర్టీసీ ఉద్యోగులకూ జీతాలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు పెరిగినా ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేయలేదు. ఆర్టీసీ సిబ్బంది ఆందోళనతో జూన్ 6న ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జూలై నుంచి పెంచిన వేతనాలు అందుతాయని ఆశ పడ్డారు. మళ్లీ నిరాశే ఎదురైంది. అనేక రకాలుగా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను మోసం చేస్తోందని సిబ్బంది వాపోతున్నారు.