తెలుగు పత్రిక ప్రపంచంలో మకుటం లేని రారాజు, అలాగే ప్రధాన రాజకీయ పార్టీకి అత్యంత నమ్మదగిన వ్యక్తిగా అందరికీ తెలిసిన రామోజీవారు మీద రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఆయన టీడీపీ మద్దతుదారు అని ఆ పార్టీకి అనుకూలంగా వార్తలు రాయిస్తారు అని చెబుతూ ఉంటారు. అయితే వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అయితే రామోజీరావు మీద ఘాటైన కామెంట్స్ చేసి తీవ్రం అంటే ఏంటో ఫస్ట్ టైమ్ మీడియాకే చూపించారు.
రామోజీరావు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అని తనకు చట్టాలు వర్తించవు అని భావిస్తారు అని అంబటి రాంబాబు విమర్శించారు. 2018 డిసెంబర్ 30న ఉమ్మడి హై కోర్టు రెండుగా విడిపోయిన సందర్భంలో రామోజీరావు మీద కేసు హై కోర్టులో కొట్టేశారని మంత్రి పేర్కొన్నారు. నాడు ఆ విషయం ఎవరికీ తెలియదని కనీసం ఏపీ సర్కార్ కి సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు.రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్ అంటూ తీవ్ర పదజాలంతో నిందించారు. మార్గదర్శి ఫైనాన్స్ పేరిట రిజర్వ్ బ్యాంక్ నిబంధలనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించి చట్టాలను అతిక్రమించారని ఆరోపించారు. ఆయన ఏకంగా 2600 కోట్ల రూపాయలను డిపాజిట్లు వసూల్ చేశారని విమర్శించారు.
అలాగే పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ని చంద్రబాబు రామోజీవారు బంధువులు నవయుగకు మూడు వేల మూడువందల రెండు కోట్ల రూపాయలు విలువ చేసే దాన్ని కనీసం టెండర్ కూడా పిలవకుండా నామినేషన్ పద్ధతిలో ఇచ్చేశారని దేశంలోనే ఇది పెద్ద స్కాం అని అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్ లో ఎనిమిది వందల కోట్లని తగ్గించి మెఘా సంస్థకు అప్పగించిందని అయితే అదొక కడుపు మంట కూడా ఉండడంతోనే పోలవరం మీద కూడా రోజూ తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు.తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు పేరుకు ప్రెసిడెంట్ అయితే అసలైన అధ్యక్షుడు రామోజీరావు అని అంబటి రాంబాబు కొత్త విషయం చెప్పారు. ఎన్టీయార్ ని పదవీచితుడిని చేయడంలో రామోజీరావు పాత్ర కీలకం అన్నారు.