అమలాపురంలో జరిగిన విధ్వంసం ప్రభుత్వ సహాయ, సహాకారాలతో పథకం ప్రకారం జరిగిందేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బుధవారం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ విధ్వంసం చేయించినవారంతా వైసిపి ముఖ్యకార్యకర్తలేనన్నారు. కోనసీమ విధ్వంసంలో కీలక పాత్రధారి ఐన అన్నం సతీశ్ ఏ పార్టీవారు ? అని ప్రశ్నించారు. అతను టిడిపి వాడయితే సజ్జల రామకఅష్ణారెడ్డిని కౌగిలించుకొని, మంత్రి విశ్వరూప్ కు సన్మానం చేస్తారా ? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి పదవి కోసం రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో మతకలహాలు సృష్టించి, 200 మంది చావుకు కారకులయ్యారని విమర్శించారు. తండ్రి చనిపోయాక ముఖ్యమంత్రి పదవి కోసం రిలయన్స్ సంస్థలపై జగన్ రెడ్డి దాడులు చేయించలేదా ? అని ధ్వజమెత్తారు. కాపు ఉద్యమం ముసుగులో తునిలో రైలు తగలబెట్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా ? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత బాబాయ్ ని చంపించింది ఈ వ్యక్తి కాదా ? అని అడిగారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారీ ఏదో ఒకటి సృష్టించడం జగన్ కు బాగా తెలుసునన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ దళిత యువకుడిని చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనమైందని, సుబ్రహ్మణ్యం హత్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కోనసీమలో జగన్ చిచ్చుపెట్టించారని ఆరోపించారు.
చంద్రబాబుకి ప్రజాదరణ పెరగడం, తెలుగుదేశం మహానాడు జరుగుతుండటంతో అమలాపురంలో విధ్వంసానికి కుట్రలేపారని దుయ్యబట్టారు. డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్ రెడ్డిదిట్ట అని ఎద్దేవా చేశారు. ఆ ప్రాంతంలో ఉద్యమం జరుగుతుందని తెలిసీ, దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కనీసం పూర్తిస్థాయి సిఐని కూడా నియమించకపోవడానికి కారణమేంటి ? అని ప్రశ్నించారు. 144 సెక్షన్ విధించినా పట్టణంలోకి ఒకేసారి అంతమంది ఎలా వచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలని అచ్చెన్నాయుడు అడిగారు. లా అండ్ ఆర్డర్ లో జగన్ ప్రభుత్వం విఫలమైందని అనడానికి మంత్రి ఇల్లు తగలబడటమే నిదర్శనమన్నారు. మంత్రి, మరో ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇళ్లకు పోలీసులు ఎందుకు పూర్తిస్థాయి భద్రత కల్పించలేదు ? ఇళ్లు తగలబడుతుంటే ఫైర్ ఇంజన్లు ఎందుకు రాలేదు ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అమలాపురం విధ్వంసం టీడీపీనే చేయించిందని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు మాట్లాడుతుండటం విస్మయం కలిగిస్తోందన్నారు. జిల్లాల విభజనలో ముఖ్యమంత్రి ఏనాడైనా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో సంప్రదించారా ? అని అడిగారు. కోనసీమ అల్లర్లపై ముఖ్యమంత్రి నుంచీ కనీస స్పందన లేకపోవడం దురదఅష్టకరమన్నారు. ప్రభుత్వ కుట్రలు, కుతంత్రాలకు ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదనీ, సంయమనంతో వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.