ప్రధానమంత్రి నరేంద్రమోదీ 26న రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొనున్నారు. అంతేకాకుండా రామగుండంలో ఏర్పాటుచేసిన ఎరువుల కర్మాగారాన్ని కూడా ఆయన హైదరాబాద్ నుంచే వర్చువల్గా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని రాక అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కసరత్తు ప్రారంభించారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే బండి చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతం కావడంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనలు పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో రాష్ట్ర పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తాజాగా ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారన్న సమాచారంతో బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది. జంట నగరాల్లో కనీవినీ ఎరగని రీతిలో ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటుచేసేందుకు పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ఒకరి తరువాత ఒకరు తెలంగాణకు వస్తుండటంతో కాషాయ శ్రేణులు జోరు పెంచాయి.