అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏం చేశారో చర్చించేందుకు వైసీపీ నేతలు సిద్ధమా ? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తన సొంత సామాజికవర్గానికి చెందిన నలుగురు వ్యక్తులకు రాసిచ్చిన జగన్ ఇప్పుడు సామాజిక న్యాయం పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం మానుకోవాలన్నారు. మహానాడును పక్కదోవ పట్టించడానికే సామాజిక న్యాయం పేరుతో మంత్రుల చేత బస్సుయాత్ర చేపట్టారని ఆక్షేపించారు. మహానాడుకు పేరు రాకూడదని వైసీపీ బస్సు యాత్ర చేపట్టిందని మండిపడ్డారు. మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం చేశామని చెబుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 2014లో 103 స్థానాలు గెలిస్తే 9 మందికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన విషయం మరిచారా ? అని ప్రశ్నించారు.
బలహీన వర్గాల బాధలు తెలిసిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారా ? అని దుయ్యబట్టారు. సొంత మనుషులకు రాష్ట్రాన్ని రాసిచ్చి, బలహీనవర్గాలకు న్యాయం చేస్తున్నానని చెబుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా బస్సు యాత్రలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.వైకాపా మూడేళ్ల పాలనలో బీసీలకు ప్రత్యేకంగా ఒక మంచి పని ఏదైనా చేశారా ? అని నిలదీశారు. ఆదరణ పథకం పెట్టి పరికరాలు ఇచ్చి స్వయంఉపాధి కల్పించామన్నారు. ఇప్పుడు జగన్ పాలనలో కనీసం పరికరాలు ఇచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. బీసీల పిల్లలకు ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్లకు వసతులు కల్పిస్తే ఆ పథకాన్ని పక్కన పడేశారని మండిపడ్డారు. కార్పొరేషన్లు పెట్టారు. మూడేళ్లలో ఒక్క పైసా అయినా ఖర్చుపెట్టారా? అని అడిగారు. 8 మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు అవినీతి కేసుల్లోని ముద్దాయిలే అని చెప్పారు. ముగ్గురు ముద్దాయిల తరఫున వాదించిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారని విమర్శించారు.