ఈ సందర్భంగా జనం సమస్యల గురించి ప్రస్తావిస్తే మాజీ మంత్రి బాలినేని సహనం కోల్పోయు అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రకాశం జిల్లా లో ‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో బాలినేనికి గ్రామంలో ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై టీడీపీ నాయకులు గేనం సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి తదితరులు అర్జీ ఇచ్చారు. రైతులను నిలువునా ముంచారని, విచారణ జరిపి వారికి న్యాయం చేయాలని కోరారు. కాగా, ‘మన పార్టీ వాళ్లే రైతులకు తక్కు వ ధర చెల్లించి ప్రభు త్వం నుంచి ఎక్కువధర తీసుకుని రైతులను మోసం చేశారు’ అని వైసీపీకి చెందిన కవిత అనే మహిళ బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ‘ఆ పని చేసింది మీ బంధువే కదా!’ అని వైసీపీకే చెందిన కొందరు ఆమెకు కౌంటర్ ఇచ్చారు. ఈ గందరగోళంలో కోపంతో రగిలిపోయిన బాలినేని అక్కడే ఉన్న దామచర్ల జనార్దన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
‘ఇదంతా జనార్దనే చేయిస్తున్నాడు. అంతుచూస్తా..’ అంటూ రెచ్చిపోయారు. కాగా, ‘చేసింది మనవాళ్లు అంటుంటే జనార్దన్ను తిడతారేంటి’ అంటూ కవిత ఎదురుతిరగడం గమనార్హం. జై జగన్.. జై బాలినేని అంటూ వైసీపీ వర్గీయులు పెద్దఎత్తున నినాదాలు చేయగా, ప్రతిగా అక్కడ ఉన్న వారు కూడా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో అందరినీ పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.
