కోర్టుల్లో ఎదురుగాలి వీస్తున్న, బీజేపీ వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, సీఎం మూడు రాజధానుల విషయం మాత్రం వదలడం లేదు. మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన స్పష్టమైన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెడతామని ఆయన తెలియజేశారు. గతంలో రాజధానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సవరించి కొత్త బిల్లు పెట్టాలనే ఆలోచన చేశామని, అయితే కొవిడ్ కారణంగా ఇది కొంత ఆలస్యం అయిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ఆరంభించవచ్చని అమర్నాథ్ తెలిపారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం జగన్ అడుగులు ముందుకు వేస్తుంటే దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి అమరావతి నుంచి అరసవెల్లి యాత్రకు ఉసిగొల్పారని విమర్శించారు. ఈ యాత్రను ఉత్తరాంధ్ర ప్రజలపై చేస్తున్న దండయాత్రగా భావిస్తున్నామని గుడివాడ అమర్నాథ్ ఉద్ఘాటించారు.
గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ “శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మూడు రాజధానుల ఏర్పాటు కోసం అడుగుముందుకు వేస్తుంటే దానిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి ఒకటే రాజధానిగా చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడమే కాకుండా అక్కడ రాజధాని నిర్మాణానికి రూ.1,10,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం రాజధానికి ఖర్చు పెట్టే కన్నా ఆ మొత్తంతో అనేక పథకాలను ప్రవేశపెట్టడానికి అవకాశం కలిగింది. రాష్ట్రంలో 15వేల కోట్లతో నాడు-నేడు వంటి బృహత్తర కార్యక్రమం, ఆసుపత్రుల అభివృద్ధి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాం విశాఖకు రాజధాని వద్దని చెప్పి, మొదటి సారి విశాఖ వచ్చిన చంద్రబాబును ఇక్కడి ప్రజలు ఎలా వెనక్కి పంపించారో అందరికీ తెలుసు.” అని అన్నారు.
అమరావతిలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో టీడీపీ అదినేత చంద్రబాబు సహా ఇతర పార్టీ నేతలు సీఎం జగన్ గురించి చులకనగా మాట్లాడటం సరికాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ సభలో చంద్రబాబుతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు చేసిన వ్యాఖ్యలు వింటే వారు కూడా విశాఖ ప్రాంత వ్యతిరేకులుగా భావించాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని, అభివృద్ధి అనేది అంతటా జరగాలని ఆలోచించి మూడు రాజధానుల ప్రకటన చేస్తే, దానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైకాపా మినహా ఇతర రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకించడం అన్యాయమన్నారు.