విశాఖపట్నంను రూ. 10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ముంబైని తలదన్నే నగరం అవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయితే వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు విశాఖపట్నంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రకటించారని చెప్పారు. ఏకైక రాజధానిగా అమరావతిని నిర్మించాలంటే ప్రభుత్వం అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని దండయాత్రలు చేయడం, అడ్డుకోవడం సరికాదన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకించిన టీడీపీ నేతలు. ఇక్కడ తలెత్తుకొని ఎలా తిరుగుతారని నిలదీశారు.
అమరావతి రైతులను అడ్డుకోవడం ప్రభుత్వానికి 5 నిమిషాల పని అని అయితే మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నామని అందరూ సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మంత్రి బొత్స ప్రశంసలు కురిపంచారు. గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా మంది రాగి అంబలి తినేవారని ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఈ ప్రాంతంలో రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాక అన్నం తిన్నామన్నది వాస్తవమన్నారు.