హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు దాఖలు చేసిన పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లే రహదారిపైనే వీధి లైట్లు వెలగక, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం చురకలంటించింది. హైకోర్టుకు వెళ్లే రహదారిపై లైట్లు వెలగకపోవడంతో పాటు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
మరమ్మతులు చేసేందుకు మూడు నెలల సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. వీధి లైట్లు ఏర్పాటు చేయడం, రోడ్లు మరమ్మతులు చేపట్టేందుకు 60 రోజుల డెడ్లైన్ విధించింది.ఈ మేరకు సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రహదారిపై వీధి లైట్లు లేకపోవడంతో ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్లో వేణుగోపాలరావు వివరించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతరుల భద్రతా దృష్ట్యా 60 రోజుల్లోగా విద్యుత్ సరఫరా, రహదారి మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించింది.