ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితుల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం,రాష్ట్రంలో కళావిహీనంగా మారడం బాధ కలిగిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వం పెడుతున్న మానసిక క్షోభ, హింసకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఈ వేడుకలు బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం వారు ఎంతగా నలిగిపోతున్నారో తెలియజేస్తోందని తెలిపారు. జ్ఞానాన్ని పంచే గురువులను వేధించిన వారందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. ఈ కబోది ప్రభుత్వానికి కళ్లు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ అన్నారు. ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఒక దేశం, ఒక జాతి భవితవ్యానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని,ఉపాధ్యాయ దినోత్సవం వేళ విజ్ఞాన ప్రదాతలైన గురువులకు ప్రణామాలు అర్పిస్తున్నానని చెప్పారు. వేద కాలం నుంచి గురు-శిష్య అనుబంధం కాలాలకు అతీతంగా కొనసాగుతూనే ఉందని తమ విద్యార్థుల ఉన్నతిని చూసి గురువులు పులకించిపోతారన్నారు.ఉపాధ్యాయునిగా ప్రస్థానాన్ని ప్రారంభించి సర్వోన్నతమైన రాష్ట్రపతి పదవి అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకోవడం గురువులందరితోపాటు సర్వేపల్లి గారిని గౌరవించుకున్నట్లే అని,ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పని చేయడం తెలుగువారికి దక్కిన భాగ్యం అని అన్నారు.