తాను ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి 27 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విజన్ ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి తప్ప, విద్వేషంతో కాదన్నారు. తాను విజన్తో పనిచేస్తే, జగన్ విద్వేషంతో పని చేస్తున్నారని విమర్శించారు. రాజకీయం వేరు అభివృద్ధి వేరు అనే విషయాన్ని తాను అచరిస్తే జగన్రెడ్డి అందుకు పూర్తి విరుద్ధంగా నడుచుకుంటున్నారని విమర్శించారు. జగన్రెడ్డి విధ్వంసం చేసిన అమరావతిని పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం కష్టంతో హైదరాబాద్ విశ్వవ్యాప్త నగరంగా అందరి ఆదరణ పొందుతోందన్నారు. ఆనాడు తన విజన్ని ఎగతాళి చేసిన వారి పిల్లలు కూడా ఇప్పుడు ఐటీలో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టామంటు జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ అమలును గుర్తు చేశారు. ఆకస్మిక తనిఖీలతో ప్రభుత్వ యంత్రాంగం పనితీరు మెరుగుపరిచి మంచి ఫలితాలు సాధించామన్నారు.ప్రతి రెవెన్యూ డివిజన్కు ఓ ఇంజినీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాల వచ్చాయని గుర్తు చేశారు. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా కేంద్రంలో కూడా కొన్ని విధానపరమైన మార్పులకు కృషి చేశామన్న చంద్రబాబు.. అప్పటి ప్రధాని వాజ్పేయిని ఒప్పించి జాతీయ రహదారుల అభివృద్ధికి పాటుపడ్డామన్నారు. టెలికం రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రంపై ఒత్తిడి చేశామన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనపై ఎక్కువ దృష్టి పెట్టడంతో తెలుగుదేశం రెండుసార్లు నష్టపోయిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలనే తపనతో పార్టీ పరంగా ఎంతో నష్టపోయామని చెప్పారు. రాష్ట్ర విభజన పట్ల 2014 నాటికి ప్రజల్లో భయాందోళనలు ఉన్నా, ఆర్థికలోటు వేధిస్తున్నా తెలంగాణ కంటే మెరుగ్గా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ నాయకుడి కోసమూ సీట్లు రిజర్వ్ చేసేది లేదన్న ఆయన పార్టీ కోసం పోరాడిన వాళ్లకే బాధ్యతలిస్తామన్నారు. లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తామని స్పష్టంచేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోణంలో కేంద్ర ప్రభుత్వంతో తమ సంబంధాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టంచేశారు. ఎన్డీఏలో చేరబోతున్నారా? అనే ప్రశ్నకు ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఉంటుందని బదులిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే 2018లో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీఎన్డీఏలో తెలుగుదేశం చేరుతుందంటూ సాగుతున్న ప్రచారంపై సూటిగా స్పందించని చంద్రబాబు అలా అంటున్న వాళ్లనే అడగాలని సూటిగా చెప్పారు.