అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి జోగి రమేష్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి రోజూ అసెంబ్లీలో గొడవపెట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారిపోయిందన్నారు. సభలో ఇలాంటి ప్రవర్తన పట్ల టీడీపీ నేతలు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకురారని పదవిలో లేనప్పుడు మాత్రమే గుర్తొస్తారని ఎద్దేవా చేశారు.
టీడీపీ నేతలు వివాదం చేయడానికి రోజుకో అంశాన్ని ఎంచుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. టీడీపీ నేతలకు ఎన్టీ రామారావుపై నిజంగా అంత ప్రేమ ఉంటే చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఎన్టీఆర్పై నిజమైన ప్రేమ ఉందన్నారు. అందుకే జిల్లాకు ఎన్టీఆర్ పెడతానన్న హామీని నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు.
వైద్య రంగంలో రాజశేఖర్ రెడ్డి ఎన్నో గొప్ప సంస్కరణలు తెచ్చారని ఆరోగ్యశ్రీతో పేదలకు ఆరోగ్యానికి భరోసా లభించిందని మంత్రి జోగి రమేష్ తెలిపారు. పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని వేలాది మంది ప్రాణాలను 108 సర్వీస్ కాపాడిందని చెప్పారు. హెల్త్ యూనివర్శిటీపై చర్చ కొనసాగితే తప్పేముందని ప్రశ్నించారు. వైద్యం విషయంలో పేదలకు సేవ చేశాడు కాబట్టే హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలని బిల్లు తీసుకొస్తున్నామని తేల్చి చెప్పారు..
ఎన్టీఆర్కు భారతరత్న కోసం చంద్రబాబు ఏం చేశారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్డీఏతో అధికారం పంచుకున్నప్పుడు కూడా ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తాము, మాత్రం ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా జిల్లాకు పేరు పెట్టామన్నారు. ఎన్టీఆర్ను గౌరవించిన పార్టీ వైసీపీ మాత్రమేనని అన్నారు.