ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధికార వైసీపీ ప్రభుత్వం మీద మాటల దాడి క్రమంగా పెంచుకుంటూ వస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడుపుతోంది సలహాదారులు అని కేబినెట్ కాదని ఏపీ బీజేపీ మండి పడింది. వైసీపీ ప్రభుత్వానికి దిశదిశా లేదని,పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతినెలా డబ్బులు ఇస్తామని బటన్ నొక్కండం కోసం కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై పూర్తి సమాచారం ఇవ్వగలరా అని ప్రశ్నలు వేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యలతో రాష్ట్రం దివాళా తీసిందని, ఆర్థిక క్రమశిక్షణ లేని రాష్ట్రం గా మార్చారని విమర్శించారు. సలహాదారులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని చివరికి రాజకీయ నిరుద్యోగికి దేవాదాయ శాఖ సలహాదారునిగా నియమించే పరిస్థితి వచ్చిందని విమర్శలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి లో ఒక్క మంత్రికి కూడా స్వతంత్రత లేదన్నారు. ప్రతి మంత్రి తన శాఖపై తప్ప ఇతర అన్ని అంశాలపై మాట్లాడతారని వ్యంగ్యంగా విమర్శలు వేశారు. విద్యాశాఖ మంత్రి సిపిఎస్ పై మాట్లాడతారు అవగాహన లేక సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చామంటారని చెబుతూంటారని, మరో వైపు సమస్యలపై ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పోలీస్ రక్షణలో వైసీపీ ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్తున్నారని,ప్రజల్లో కనిపిస్తున్న ఆగ్రహంతో వారంతా ఆందోళన చెందుతున్నారన్నారు. తాత్కాలిక పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారురని తీవ్ర విమర్శలు చేశారు.
ఆంధ్రా బీజేపీ ఇటీవల యువ సంఘర్షణ ర్యాలీలు నిర్వహించి ఏపీలో ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంపై ఉద్యమం చేశారు. తాజాగా ఐదు వేల సభలు నిర్వహించి ప్రజాపోరు చేపట్టాలని సంకల్పించారు. ఈ సభల బాధ్యతలను విష్ణువర్దన్ రెడ్డికి అప్పగించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకాన్ని బీజేపీ ఎండ గడుతుందని విష్ణువర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో వైసీపీ తప్పుల్ని ఎత్తిచూపిస్తామని పాలనా వైఫల్యాలపై బీజేపీ ప్రజా ఉద్యమం ప్రారంభించబోతోందని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. ప్రజలకు వైసీపీ అనేక హామీలు ఇచ్చి వంచించిందన్నారు. వీటన్నింటినీ ప్రజలకు తెలియచేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మినీ సభలు రాష్ట్రంలో నిర్వహిస్తాం,కేంద్ర,రాష్ట్ర ముఖ్య నేతలు సభల్లో పాల్గొంటారని విష్ణువర్థన్ రెడ్డి ప్రకటించారు.