దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని సమస్య మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదే టాప్ బర్నింగ్ ఇష్యూ మూడు రాజధానులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలనుకుంటోంది. విపక్షాలన్నీ ముక్త కంఠంతో వద్దంటున్నాయి.చట్టం కూడా సహకరించడం లేదు. కానీ “ప్రయత్నిస్తే అసాధ్యం పోయేది ఏముంది” అనే టైపులో స్ఫూర్తిని నింపుకుని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఈ మొత్తం వ్యహారం ఎటు తేలాలన్నా బీజేపీ పాత్ర కీలకం. బీజేపీకి ఏపీలో ఎలాంటి బలం లేకపోయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ ఓకే అంటేనే మూడు రాజధానుల వ్యవహారం కాస్త ముందుకు కదపగలుగుతుంది. లేకపోతే అంతే సంగతులు. మరి కేంద్రంలోని బీజేపీ వైఖరేంటి, అమరావతే అంటున్న ఏపీ బీజేపీ నేతల విధానానికే కట్టుబడతారా, అదే జరిగితే జగన్ మూడు రాజధానుల్ని ఎప్పటికైనా చేయగలరా…
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారలో ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి అన్నీ పనులు సాఫీగా సాగిపోయాయి. బీజేపీ మద్దతు పూర్తిగా లభించింది. పర్యావరణ అనుమతులు దగ్గర నుండి వివిధ రకాల అనుమతులు వీలైనంత త్వరగా పూర్తయ్యాయి. ప్రపంచ బ్యాంగ్ నిధుల లైన్ తేలికగానే క్లియర్ అయ్యింది. అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్క సారిగా పరిస్థితులు మారిపోయాయి. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నా బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. బీజేపీ తరపున ఏపీ వ్యవహారాలు చూసే ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని పదే పదే ప్రకటిస్తూ వైసీపీ ప్రభుత్వానికి నైతిక మద్దతు అందించారు. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని అది గత ప్రభుత్వం, ప్రస్తుత సీఎం జగన్ అంగీకారంతోనే అమరావతిగా నిర్ణయించిందని జీవీఎల్ పరిగణనలోకి తీసుకోలేదు. మార్చుకోవడం ఏపీ సర్కార్ ఇష్టమన్నారు. ఆయన ప్రకటనలకు తగ్గట్లుగా కేంద్రం కూడా పట్టించుకోలేదు. అంటే బీజేపీ హైకమాండ్ మరియు కేంద్రం కూడా జగన్ ప్రయత్నాలను అడ్డుకోలేదు. అలాగని ప్రోత్సహించలేదు. కానీ న్యాయపోరాటం ద్వారా రైతులు తమ రాజధానిని చట్ట పరంగా కాపాడుకోగలిగారు.
ఇటీవల బీజేపీ భాష లోనూ మార్పు వచ్చింది. అమరావతికి భేషరతు మద్దతు పలికారు.ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అమరావతి గ్రామాల్లో పాదయాత్ర చేశారు. గతంలో తాము వ్యవహరించిన విధానంపై విమర్శలు ఎదురైనా ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. తమ విధానం అమరావతేనని స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్రం నుంచి కూడా అమరావతికే సానుకూలం అనే రీతిలో ప్రకటనలు రావడం మొదలైంది. కొత్తగా విడుదల చేసిన ఇండియామ్యాప్లో ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే గుర్తించారు. విభజన చట్టం ప్రకారం ఒకే రాజధాని అని స్పష్టత వచ్చేలా విభజన సమస్యలపై చర్చల ఎజెండాలో చేర్చారు. జీవీఎల్ నరసింహారావు పూర్తిగా అమరావతే రాజధాని అని చెబుతున్నారు. ఏపీ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులు కూడా అమరావతే రాజధాని అని స్పష్టం చేస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు లేకుండా మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయడం కానీ అసెంబ్లీలో పాస్ చేసుకోవడం కానీ చట్టంగా మార్చడం గానీ సీఎం జగన్ చేయలేరు. ఎందుకంటే ఇప్పటికే మూడు రాజధానుల అంశం హైకోర్టులో తేలిపోయింది. మరోసారి బలం ఉందని బిల్లును ఆమోదించినట్లయితే అది కోర్టు ధిక్కరణ అవుతుంది. గవర్నర్ సంతకం చేయరు. పైగా రాజ్యాంగ ఉల్లంఘన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశంలో బీజేపీ మద్దతు ఉంటేనే ముందుకెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనా జగన్ నిర్ణయం కేంద్రం చేతిలో ఉందని మాత్రం అర్దం అవుతుంది.