ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య CPS మంటలు ఇప్పట్లో చల్లారేటట్లు లేదు. ఈ రోజు ఏర్పాటు చేసిన సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పాత పింఛన్పై మాట్లాడదామంటేనే తాము వచ్చామని మంత్రులతో సమావేశంలో స్పష్టంచేసినట్టు ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు తెలిపారు. జీపీఎస్ గురించి మాట్లాడాలనుకుంటే ఇకపై చర్చలకు పిలవద్దని చెప్పినట్టు వెల్లడించారు. తాము సమావేశ గదిలోకి వెళ్లాక మంత్రులు ఎప్పటిలానే జీపీఎస్ విధానంపైనే మాట్లాడదామన్నారని తెలిపారు. పాత పింఛను విధానంపై మాట్లాడదామంటేనే తాము వచ్చామని, లేదంటే వచ్చేవాళ్లం కాదని చెప్పామన్నారు. తాము పాత పింఛనుపై మాట్లాడదామంటే మీరు జీపీఎస్ విధానంలో కి రండి దానికి తాము కొంత వెసులుబాట్లకు సిద్ధమేనని మంత్రులు చెప్పారని తెలిపారు. కానీ, పాత పింఛను విధానంలోకి వస్తే ఒకట్రెండు వెసులుబాట్లకు సిద్ధమేనని తెలిపామని చెప్పారు.
ప్రభుత్వం తరఫు నుంచి పాత పింఛను విధానానికి వచ్చే అవకాశం ఇసుమంత కూడా లేదని మంత్రులు చెప్పారని నేతలు తెలిపారు. ఆమాత్రం దానికి ఎందుకు ప్రతిసారీ చర్చలకు పిలవడం దేనికి ఇది కరెక్టు కాదని చెప్పామని APCPSUS అధ్యక్షుడు మరియదాస్ తెలిపారు.వేలాది సీపీఎస్యూఎస్ నాయకులు, టీచర్లపై కేసులు పోలీసులు కేసులు పెట్టారని, అక్రమ కేసులు రద్దు చేయాలని కోరినట్టు తెలిపారు. డీజీపీని కలిసి కేసులు ఎత్తివేయాలని కోరనున్నట్టు సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సెప్టెంబర్ 1న పోలీసులు తమ ఇళ్లు ముట్టడించారని నేతలు రవికుమార్, దుర్గారావు తెలిపారు. మహిళా ఉద్యోగులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.