“మా ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువే. ఆర్థికవ్యవస్థను చక్కగా నిర్వహిస్తున్నాం. మేం ఎక్కువ అప్పులు చేస్తున్నామంటూ అనవసరంగా మాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మొన్నే సీఎం జగన్ అసెంబ్లీ లో చెప్పుకొచ్చారు. ఇంతలోనే అందుకు విరుద్ధంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్(CAG) నివేదికను ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది.రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు కాగ్ తేల్చిచెప్పింది. రుణాలను భరించే సామర్థ్యం రాష్ట్రానికి లేదని స్పష్టం చేసింది. పాత రుణాలు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు వెల్లడించింది .
2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బకాయిలు GSDPలో 35శాతానికి మించకూడదని ఎఫ్ఆర్బీఎం చట్టం చెబుతోందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది . 2021 మార్చి 31కి ఈ రుణాలు 35.30 శాతం ఉండటం పరిమితులను దాటినట్లయింద వెల్లడించింది . బడ్జెట్లో చూపకుండా బయటి నుంచి తీసుకునే రుణాలు కలిపితే జీఎస్డీపీలో రుణాల వాటా 44.04 శాతంకు పెరుగుతోంది అని,2021 మార్చి 31 నాటికి ఉన్న పరిస్థితుల ప్రకారం రాబోయే ఏడేళ్లలో 45.74శాతం అంటే లక్షా 23 వేల 640 కోట్ల రూపాయల అప్పులు తీర్చాలని నిజాలు బయట పెట్టింది.అందుకు సరైన వ్యూహం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తగ్గిపోతాయనీ హెచ్చరించింది.
జీఎస్డీపీలో రుణాల వాటా 44.04 శాతానికి పెరిగినట్లు కాగ్ పేర్కొంది “సాధారణంగా రాష్ట్రం తీసుకున్న అప్పులను ఆస్తుల సృష్టికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలి. రుణాల బకాయిల మీద వడ్డీలు చెల్లించేందుకు, రోజు గడిచేందుకు అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. ఏపీలో రుణం తీసుకుని పాత అప్పులు తీరుస్తున్నారు. ఆస్తులు సృష్టించేందుకు కాకుండా.. రెవెన్యూ ఖర్చులకు వినియోగిస్తున్నారు. రాష్ట్రానికి రుణాలను భరించే సామర్థ్యం లేదు” అంటూ కాగ్ రాష్ట్ర ప్రభుత్వ తీరును తెలిపింది.
తీసుకున్న రుణాల్లో ఏకంగా 81% రెవెన్యూ ఖర్చుల కోసమే వినియోగిస్తున్నారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఆస్తుల కల్పనకు ఆటంకం కలుగుతోందని కాగ్ అభిప్రాయపడింది. బడ్జెట్లో చూపకుండా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటున్నారని కాగ్ వెల్లడించింది . దీంతో మొత్తం రుణాలను, ద్రవ్యలోటునూ తగ్గించి చూపుతున్నారని తప్పుబట్టింది. దీనివల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రుణాల వాటా ఏకంగా 44 % పెరిగిందని కాగ్ తేల్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును భర్తీ చేసేందుకు 7 వేల 268 కోట్ల నికర వసూళ్లను వినియోగించాల్సి వచ్చిందని కాగ్ పేర్కొంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వల్ల రుణాలు పెరిగాయని పేర్కొందని.. అయితే ఆరోగ్యరంగంలో ఏపీ కేటాయింపులు తక్కువగానే ఉన్నాయని కాగ్ విశ్లేషించింది. ఇతర రాష్ట్రాలు ఆరోగ్యరంగంపై 6.74 % నిధులు వెచ్చిస్తుంటే ఏపీ మాత్రం 5.49 % మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపింది.