తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను ఇక్కడి సంస్థలకు కంపెనీలకు పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా యునైటెడ్ కింగ్ డం ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధి బృందాలకు తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపార వాణిజ్య అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ముఖ్యంగా టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు కోసం తీసుకొచ్చిన పాలసీలు, వాటితో పాటు ఇప్పటివరకు తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వినూత్నమైన పారిశ్రామిక పాలసీలతో పాటు పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, నీళ్లు విద్యుత్ సదుపాయాలతో పాటు నాణ్యమైన మానవ వనరులు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయన్నారు. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, పాలసీలు ప్రోత్సాహకాలు తెలంగాణలో ఉన్నాయన్న కేటీఆర్, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా దేశంలోని ఇతర నగరాల్లో లేని అసలు సిసలైన కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్ లో మాత్రమే ఉందన్నారు.
ఇండియాలో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా అనేకసార్లు అవార్డులను హైదరాబాద్ అందుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు లైఫ్ సైన్సెస్ – ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు ఒక హాబ్ గా మారిందన్నారు. పలు మల్టీనేషనల్ కంపెనీలు అమెరికా తర్వాత అంత పెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో మాత్రమే ఏర్పాటుచేశాయన్న సంగతిని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న బలమైన వ్యాపార,వాణిజ్య సంబంధాల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భారతదేశం కోణంలో నుంచి మాత్రమే తెలంగాణను చూడొద్దన్న కేటీఆర్, తమ రాష్ట్రంలోని వినూత్న, విప్లవాత్మక విధానాలు, అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. డెలాయిట్, హెచ్ఎస్బిసి, జెసిబి, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ , తెలంగాణ అధికార ప్రతినిధి బృందం ఉన్నది.
బ్రిటన్ ట్రేడ్ మినిస్టర్తో మంత్రి కేటీఆర్ భేటీ
బ్రిటన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ రనిల్ జయవర్ధనతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. లండన్ లోని మంత్రి జయవర్ధన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం ప్రాధాన్యతలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలకు సంబంధించి, వివిధ అంశాలపైన చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో పాల్గొనాల్సిందిగా జయవర్ధనకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీఎస్-ఐపాస్ విధానం గురించి తెలుసుకున్న బ్రిటన్ మంత్రి, ఈ విధానంపైన ప్రశంసలు కురిపించారు.