ఏకైక రాజధానిగా అమరావతి ని కొనసాగించాలని, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని దీక్షలు చేస్తున్న 1000 రోజులు కావస్తున్నా సందర్భంగా తమకు న్యాయం చేయాలని పాదయాత్ర చేయబోతున్న రైతులకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూ ఉంది.రాజధాని రైతుల మహాపాదయాత్రపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు సాయంత్రంలోగా పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. లేదంటే శుక్రవారం ఉదయం మొదటి కేసుగా విచారిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
అమరావతి రైతులు ఈనెల 12 నుంచి అమరావతి నుంచి అరసవెల్లి వరకు తలపెట్టిన మహా పాదయాత్రకు అనుమతి కావాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ను హైకోర్టు విచారణ జరిపింది. పోలీసులు అనుమతిపై ఇంకా ఏ విషయం తెలపలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది.