ఆసుపత్రి కార్పొరేట్ కంటే గొప్పగా ఉందని ప్రశంసలు కురిపించారు
త్వరలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తాం : ఈవో ధర్మారెడ్డి
టీటీడీ నిర్వహణలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదాలయాన్ని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యురాలు సుధనారాయణమూర్తి మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోని ఐసియు, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. పిల్లల గుండె ఆపరేషన్ కోసం వచ్చిన బంగ్లాదేశ్, కోల్ కతా ప్రాంతాలకు చెందిన వారితో ఆమె మాట్లాడారు. ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. డాక్టర్లు, సిబ్బంది నిబద్ధతతో వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఆసుపత్రి కార్పొరేట్ స్థాయి కంటే బాగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టిటిడి ఈఓ ధర్మా రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభించిన ఆరు నెలల్లోనే 500 కు పైగా గుండె ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించామన్నారు. వారం రోజుల వయసున్న పిల్లలకు కూడా విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేశామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి సుధనారాయణ మూర్తికి వివరించారు. త్వరలోనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రూ.20 నుంచి 25 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కొన్ని యంత్రాలు అవసరమవుతాయని వాటిని సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నామని ధర్మారెడ్డి వివరించారు.
ఇదీ మా భారతదేశం గొప్పదనం : బంగ్లాదేశ్ వ్యక్తితో సుధనారాయణమూర్తి
వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఎక్కడి వారికైనా ఉచితంగా సర్జరీలు చేస్తున్నామని ఇదీ భారత దేశం గొప్పదనమని సుధ నారాయణమూర్తి చెప్పారు. బంగ్లాదేశ్ రాజధాని డాఖాకు చెందిన మహమ్మద్ అబుల్ కసన్ తో ఆమె మాట్లాడారు. ఐదేళ్ల తన కూతురు ఫహీబాకు గుండెలో రంధ్రం ఏర్పడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందని చెప్పారు. గూగుల్ లో ఉచితంగా గుండె ఆపరేషన్ చేసే చిన్నపిల్లల ఆసుపత్రి కోసం వెదికానని, తిరుపతిలో ఇలాంటి ఆసుపత్రి ఉందని ఇక్కడ వైద్య సేవలు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలుసుకుని ఇక్కడకు వచ్చామని సుధ నారాయణమూర్తికి చెప్పారు. మెయిల్ ద్వారా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డిని సంప్రదించానన్నారు. పాప మెడికల్ రికార్డులన్నీ ఆయనకు పంపనున్నారు. వాటిని పరిశీలించి ఆపరేషన్ చేస్తామని జూలై 24న ఆసుపత్రికి రావాలని పిలిచారన్నారు. జూలై 24వ తేదీ ఆసుపత్రికి వచ్చి అపాయింట్ మెంట్ తీసుకున్నామని, 29 వ తేదీ రూపాయి ఖర్చు లేకుండా పాపకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేశారని ఆయన వివరించారు. డాక్టర్లు, సిబ్బంది చాలా మంచి సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనాధ్ రెడ్డి, ఆర్ఎంఓ భారత్ తదితరులు పాల్గొన్నారు.
![](http://navandhra.com/wp-content/uploads/2022/06/logo13.png)