రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని “రాష్ట్రపత్ని” అంటూ కాంగ్రెస్ నేత అధీర్ రంజాన్ చౌదరి అవమానించడంపై పార్లమెంట్ లో మహిళా ఎంపీలు భగ్గుమన్నారు. ఆమెకు జరిగిన అవమానంపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తూ లోక్ సభ కార్యకలాపాలను స్తంభింపజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోకసభ పక్ష నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపత్ని అన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి పీఠం ఎక్కడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందంటూ మండిపడ్డారు. రాష్ట్రపతి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే దేశ ప్రజలందరినీ అవమానించడమేనని అన్నారు. అధీర్ రంజన్ వ్యాఖ్యలపై సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాలలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
