కుప్పం మున్సిపాలిటీని గెలుస్తామని అనుకున్నామా ? ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామని అనుకున్నామా ? కానీ గెలిచామన్నారు. ఎందుకు జరిగింది? అలాగే 175కి 175 సాధించగలుగుతాం. ఇది జరగాలి అంటే.. మనం కష్టపడాలని అని గడపగడపకు వర్క్షాపులో సీఎం జగన్ ప్రసంగించారు. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలి. ఇది మన లక్ష్యం, ఇది కష్టం కాదు. ఎందుకంటే.. ప్రతి ఇంటికీ మీరు వెళ్తున్నారు, ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరిస్తున్నారు. ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందాయో చెప్తున్నారు. మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నాం. కాలర్ ఎగరేసుకుని తిరగగలుగుతున్నామని.. మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును మనం తీసుకోవడమేనని జగన్ స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాల్టీని టీడీపీ దక్కించుకున్న సంగతిని జగన్ మరిచిపోకూడదు. తాడిపత్రిలో ఓడిపోతామని ఎవరైనా, ఎప్పుడైనా అనుకున్నామా? అని ఏ ఒక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధి అయినా ప్రశ్నించుకున్నారా ? 2019 ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ విజయ కేతనం ఎగరేసింది. మున్సిపల్ ఎన్నికలకు వచ్చే సరికి అధికార పార్టీ బొక్క బోర్లా పడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? రాష్ట్రమంతా ఏకపక్షంగా ఫలితాలు వైసీపీ వైపు వచ్చాయి. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి జనం ఎందుకు పట్టం కట్టారో జగన్ వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, పరిటాల రవి హవా కొనసాగుతున్న రోజుల్లో ఇదే తాడిపత్రి మున్సిపాల్టీలో జేసీ బ్రదర్స్ కనీసం తమ వాళ్లతో నామినేషన్లు వేయించలేకపోయారు. కేవలం కుప్పం మున్సిపాలిటీ, అలాగే ఆ నియోజకవర్గ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేశామని అత్యుత్సాహానికి పోతే అసలుకే ఎసరొస్తుంది. కుప్పంలో గెలుపును ఆస్వాదించడంతో పాటు తాడిపత్రి ఓటమిని కూడా గమనంలో పెట్టుకుని జాగ్రత్తగా నడుచుకోవాలి. గెలుపు అనేది మత్తెక్కిస్తుంది. కానీ ఓటమి అప్రమత్తం చేస్తుంది. ప్రస్తుతం జగన్ , వైసీపీ ప్రజాప్రతినిధులు ఏ రకమైన ఫీలింగ్లో ఉన్నారో తమకు తాము ఆత్మపరిశోధన చేసుకోవాలి.
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న వార్ తో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దీంతో ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు మాటలతో పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ తమకు 160 సీట్లు ఖాయమంటుంటే వైసీపీ ఏకంగా 175కు 175 సీట్లు గెలుస్తామని ఊదరగొడుతోంది.దీనిపై ఇవాళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు, రానున్న ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సిఎం వైఎస్ జగన్కు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్లలో వైసిపి నాయకులు ప్రజలను దగా చేశారన్నారు. ఒక్క అవకాశంతో అధికారంలోకి వచ్చి అన్ని రంగాలనూ నాశనం చేశారని ఆరోపించారు. ఏ రంగంలో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
30 ఏళ్లు తమదే పాలన అని డాంభికాలు పలికిన జగన్కు, వైసిపి ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఓటమి భయం పట్టుకుందన్నారు. వ్యవస్థల్ని వాడుకుని, పోలీసులను తన ఆధీనంలోకి తెచ్చుకొని ఇతర పార్టీలపై దాడులు చేసి గెలవడానికి మున్సిపల్, మండల, పంచాయతీ ఎన్నికలు కావన్నారు. గడప గడపకు వైసిపి కార్యక్రమంలో సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోకుండా చంద్రబాబుకు వయసయిపోతుందని మాట్లాడటం సరికాదన్నారు. జగన్ రాజకీయాలకు అనర్హుడని, ఒక్కసారి ప్రజలు వైసిపికి ఓట్లు వేసి నష్టపోయారని చెప్పారు. రాష్ట్రంలో వైసిపికి పూర్తి వ్యతిరేకత వచ్చిందని, ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపకపోతే ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు.
జగన్ పులివెందులలో గెలిచే పరిస్థితి ఉందా ? : తులసిరెడ్డి
రాబోవు ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలలో గెలవాలని జగన్ మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. 174 నియోజకవర్గాల పరిస్థితి దేవుడు ఎరుగు. ముందు పులివెందులలో గెలిచే పరిస్థితి ఉందో లేదో ఆలోచించుకోవాలన్నారు. గడప గడప ప్రోగ్రామ్ అట్టర్ ఫెయిల్యూర్ అని, బస్ యాత్ర తుస్సు యాత్ర అయ్యిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైసిపి పట్ల ప్రజా వ్యతిరేకతకు ఇవి నిదర్శనాలని, అయినా వైసిపి కి ఎందుకు ఓట్లు వేయాలి? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందుకా?…నిత్యావసర సరుకుల ధరలు పెంచినందుకా?…అవినీతి ఆంధ్ర ప్రదేశ్ గా మార్చినందుకా?… అరాచక పాలన అందిస్తునందుకా.?. రైతులకు అన్యాయం చేసినందుకా?… ఉద్యోగులను మోసం చేసినందులకా..?నిరుద్యోగులను నమ్మించి మోసగించినందుకా?..రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకా?..ప్రత్యేక హోదా సాధించ లేనందుకా?.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముట్టుకుంటే షాక్ కొట్టేలా కరెంట్ ఛార్జీలు పెంచినందుకా?… ఆర్టీసి ఛార్జీలు పెంచినందుకా…? పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ ధరలు ఎక్కువ ఉన్నందుకా..? రైతుల మోటార్ల కు మీటర్లు బిగిస్తునందుకా?…అయినా తల్లికీ, చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తాడని ఓట్లు వేయాలి ? అని తులసిరెడ్డి పేర్కొన్నారు.