కలెక్షన్ల రికార్డులు.. శతదినోత్సవాల కేంద్రాలు ఇలాంటి లెక్కలకు ఈ సినిమా అతీతం. అది త్రివిక్రముడు సెల్యులాయిడ్ రాజకుమారుడితో చేసిన మ్యాజిక్.. అదే అతడు సినిమా. అప్పటివరకూ మహేష్ బాబు చేసిన సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా ఒక ఎత్తు. ఏదైనా ఒక సినిమా ఒకసారి చూస్తారు.. రెండు సార్లు చూస్తారు.. లేదా ఓ నాలుగైదు సార్లు చూస్తారు. కానీ, ఆ సినిమాని మాత్రం 18ఏళ్ల నుంచి ఎన్నిసార్లు టీవీలో ప్రసారం చేసినా.. ఇప్పటికీ జనం చూస్తూనే ఉన్నారు… ఎందుకంటే అప్పటివరకు మహేష్ బాబు సినిమాలన్నీ ఓ మూసధోరణిలోనే వెళ్తున్నాయనే టాక్ తో ఉన్నాయి. అందులోనూ మురారి సినిమా తర్వాత మళ్ళీ ఫ్యామిలీ కథలను ఎప్పుడు టచ్ చేయలేదు మహేష్. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ఈ అతడు సినిమా 2005 ఆగస్టు 10 న విడుదలై అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది. అప్పటివరకూ రచయితగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇద్దామని అనుకున్నాడు. ఈ కథని మహేష్ బాబుకి చెబితే మహేశ్ కి బాగా నచ్చిందట.. కానీ అప్పటికే అర్జున్, నాని సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ నెక్స్ట్ ఇయర్ చేద్దామని చెప్పాడట. అప్పటిలోపు ఓ సినిమా చేయండి అని సలహా కూడా ఇచ్చాడట. దీంతో త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో దర్శకుడిగా త్రివిక్రమ్కు అతడు రెండో సినిమాగా నిలిచింది. ‘అతడు’ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీవినాస్.. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన ‘వారసుడొచ్చాడు’ సినిమాను కొద్దిగా మార్పులు చేర్పులు చేసి.. కొన్ని హాలీవుడ్ యాక్షన్స్కు తనదైన మాటల సంభాషణతో ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత మహేష్ తో సినిమాని స్టార్ట్ చేశాడు త్రివిక్రమ్.
ముందుగా ఈ సినిమాని పద్మాలయా బ్యానర్ పైనే సినిమా తీద్దామని హీరో కృష్ణ అనుకున్నారట. కానీ త్రివిక్రమ్ టాలెంట్ ని ముందే గుర్తించిన నటుడు, వ్యాపారవేత్త, నిర్మాత మురళీ మోహన్ తన జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ ఇవ్వడంతో ఈ సినిమా కృష్ణకి ఆ ఛాన్స్ మిస్ అయింది. మహేష్ బాబు పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ సినిమాగా అతడు నిలిచింది. ఇందులో నాజర్ పాత్రకి ముందుగా శోభన్ బాబు అనుకున్నారు మురళీమోహన్, త్రివిక్రమ్.. అందగాడిగా అందరు మెచ్చుకునే తాను ముసలి పాత్రలో నటించడం ఇష్టం లేక ఈ సినిమాని ఒప్పుకోలేదట. ఇందులో హీరోయిన్ పేరు పూరి.. త్రివిక్రమ్ ఇంటిపక్కన ఉండే ఓ అమ్మాయి పేరు పూర్ణిమ.. ఆమెను అందరూ పూరి అని పిలిచేవారట.. అది బాగా నచ్చి ఇందులో హీరోయిన్ కి అదే పేరు పెట్టేశాడట త్రివిక్రమ్. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల కోసం టైమ్-ఫ్రీజ్ ఎఫెక్ట్ షాట్లను వాడారు. యాక్షన్ సన్నివేశాలను పీటర్ హీన్ పర్యవేక్షణలో ఈ సన్నివేశాలను తెరకెక్కించారు. అప్పట్లో ఎక్కువ డీవీడీలు అమ్ముడు పోయిన సినిమా కూడా అతడునే. మొత్తం ఈ సినిమా 205 కేంద్రాల్లో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఇక హైదరాబాద్ లోని సుదర్శన్ 35 మిమీలో 175 రోజులు ఆడింది. దాదాపుగా ఈ చిత్రం 40 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా విడుదలైన 7 సంవత్సరాల తర్వాత మాటీవీ అతడు సినిమా శాటిలైట్ రేనివల్ కోసం ఏకంగా 3.5 కోట్లు చెల్లించడం.. అప్పట్లో సెన్సేషన్ టాపిక్ అయింది. ఈ సినిమా తమిళంలో నందు అనే పేరుతో, మలయాళంలో టార్గెట్ అనే పేరుతో అనువాదం అయింది. హిందీలో ఏక్ అనే పేరుతోనూ, బెంగాలీలో వాంటెడ్ పేరుతో పునర్మించారు. పోలండ్ భాషలో విడుదలైన మొదటి తెలుగు సినిమా కూడా అతడు కావడం విశేషం. ఈ సినిమాకి ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, ఉత్తమ మాటల రచయితగా త్రివిక్రమ్ నంది అవార్డులను అందుకున్నారు. వెండితెరపై కంటే బుల్లితెర పైన ఎక్కువ ప్రభంజనం సృష్టించింది ఈ మూవీ. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్తో పాటు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ సినిమా క్లాసిక్ థ్రిల్లర్గా తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది.
