175 కి 175 సీట్లు అన్న నినాదం తో రాబోయే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు అధికార వైసీపీ పార్టీ అందుకు తగ్గట్టు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత సొంత నియోజకర్గమైన కుప్పంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పం వస్తుండటంతో పోలీసులు పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. మూడో విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కుప్పానికి శుక్రవారం వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా 2,500 మంది వరకు పోలీసు సిబ్బంది పట్టణంలో అడుగడుగునా మోహరించారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్రన్ కోసం గురువారం కొద్దిసేపు కుప్పం చెరువు కట్ట వద్ద వాహనాలు నిలిపేయడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పలేదు. పట్టణ సమీపంలోని హెలిప్యాడ్ నుంచి సభాప్రాంగణం వరకు రోడ్డును మధ్యలో తవ్వి బారికేడ్లు ఏర్పాట్లు చేయడంతో పట్టణంలో రాకపోకలు సాగించే వాహనదారులు అవస్థలు పడ్డారు. జగన్ వెళ్లాక రోడ్డు మధ్యలో ఉన్న గుంతలను ఎవరు పూడ్చుతారోననే చర్చ పట్టణంలో సాగుతోంది.మరోవైపు దుకాణాలకు వెళ్లేందుకు దారి లేక రెండు రోజులుగా వ్యాపారాలు సరిగా లేవని వ్యాపారులు వాపోతున్నారు.
హెలిప్యాడ్ నుంచి సుమారు నాలుగు కి.మీ.మేర బ్యానర్లు, ప్లెక్ల్సీలను వైసీపీ అభిమానులు ఏర్పాటు చేశారు. సీఎం సభకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు బస్సులు ఇవ్వాలంటూ ఆ పార్టీ నాయకులు ముందుగానే మాట్లాడుకున్నారు. గురు, శుక్రవారాలు కుప్పం మండలంలోని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని కోరుతున్నా, ఆయన రాక నేపథ్యంలో జగన్ ఫొటోలతో కుప్పంలో భారీగా వెలిశాయి. రోడ్డు వెంట ఉన్న చెట్లకు సైతం వైకాపా రంగులద్దారు.
ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటన సందర్భంగా ఆ నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలను అన్ని మండలాల్లో తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. తెలుగుదేశం శ్రేణులు శాంతిభద్రతలకు విఘాతం కల్గించే అవకాశం ఉందని వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతిపురం, కుప్పం, గుడిపల్లె మండలాలకు చెందిన తెలుగుదేశం నాయకులు జిల్లాలో 190 కిలోమీటర్ల దూరములోని విజయపురం, నిండ్ర, కార్వేటి నగరం మండలాల తహసీల్దార్ల ఎదుట హాజరయ్యారు.
45 నుంచి 60ఏళ్లు మధ్య వయస్సు గల పేద మహిళలకు.. 18,750 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. అర్హులైన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ఖాతాల్లోనే నగదు జమ కానుంది. మొత్తం 26,39,703 మంది మహిళలకు 4,949.44 కోట్లను జగన్ విడుదల చేయనున్నారు.