ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆంధ్రప్రదేశ్ బీజేపీ పోరాడి ప్రజల్లో ఆదరణ పెంచుకునేందుకు వరుసగా కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల యువ సంఘర్షణ యాత్రలను నిర్వహించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ ఈ యాత్రలు కొనసాగించారు. వీటిని బీజేపీ యువ నేత, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయవంతం అయ్యేలా చూశారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు నిర్వహించాలనుకుంటున్న ప్రజాపోరు సభలకు స్టేట్ ఇంచార్జిగా విష్ణువర్ధన్ రెడ్డికే ప్రధాన బాధ్యతలు అప్పగించారు.
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో చంద్రబాబుకు చాన్సిచ్చారు,జగన్కూ ఇచ్చారు ఇప్పుడు మాకు ఓ చాన్సివ్వాలన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అదే సమయంలో ప్రజలకు తాము ఏం చేశాం అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది కూడా వారికి వివరించగలిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గణనీయంగా సాధించవచ్చని బీజేపీ వ్యూహం సిద్ధం చేసుకుంది.దీనిలో భాగంగా ఐదు వేల ప్రజాపోరు సభలు ఏర్పాటు చేయాలని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత 8 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ఇచ్చిన వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను గురించి, మంజూరు చేసిన అనేక విద్యాసంస్థలను గురించి ఆ సభల్లో చెప్పనున్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండటం వల్ల,ఆయా రాష్ట్రాలలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు ప్రత్యేకంగా బహిరంగ సభల్లో తెలియచేసి ఏపీలోనూ బీజేపీ ప్రభుత్వం వచ్చేలా చేయాలని ఏపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బహిరంగ సభలలో కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొంటారు.