మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జులై 8,9 తేదీలలో గుంటూరు-విజయవాడ నగరాల మధ్యలో సౌకర్యవంతమైన ప్రదేశంలో నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, జిల్లా అద్యక్షులు, కోఆర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపారు. ప్లీనరీకి సంబంధించి పార్టీ నేతలు, కార్యకర్తలకు, అతిధులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్లీనరీ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జులై 8 న ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం వరకు ప్లీనరీ కొనసాగుతుందన్నారు. పార్టీ నేతలందరూ ప్లీనరీకి సమాయత్తం కావాలని కోరారు.
రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనే విధంగా అందరూ సమష్టిగా పనిచేయాలనేది ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశ్యమన్నారు. పార్టీ నేతలకు సంబంధించి ఎక్కడైనా చిన్నపాటి విభేదాలున్నప్పటికి వాటిని పక్కన పెట్టి ఐకమత్యంగా ముందుకు నడవాలన్నారు. వైసీపీలో వర్గాలకు తావులేదన్నారు. అలాంటివి ఎవరి మధ్యన ఉన్నా వాటిని ప్రోత్సహించే పరిస్దితి ఉండదని స్పష్టం చేశారు. ఇది పార్టీలో ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.
పార్టీ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలకు సంబంధించి పార్టీ నియమనిబంధనలకు అనుగుణంగా పార్టీకి లాయల్ గా అంకితభావంతో పనిచేసే వారికి స్ధానం కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ పాటించడంతో పాటు ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలకు తగిన విధంగా ప్రాతినిధ్యం ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పార్టీ ఎంఎల్ఏలు, నియోజకవర్ఘ ఇన్ ఛార్జ్ లు స్ధానికంగా పార్టీ పటిష్టత కోసం పాటు పడేవారిని సూచించాలనేది ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి ఆకాంక్ష వివరించారు. ఈ పేర్లను జూన్ 10 వ తేదీ నాటికి జిల్లా అధ్యక్షుల ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుందన్నారు. జిల్లా అధ్యక్షులు కూడా పార్టీ కమిటీలకు సంబంధించి పార్టీ ఎంఎల్ ఏలు,సమన్వయకర్తలను సమావేశపరిచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారుచేసుకోవాలన్నారు. తదనంతరం కమిటీల నిర్మాణం చూడాలన్నారు. రీజనల్ కోఆర్డనేటర్లు కూడా వారి పరిధిలోని జిల్లా అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నూతన కమిటీల నియామక ప్రకటన అనేది పార్టీ ప్లీనరీలో జరుగుతుందని వివరించారు. బూత్ కమిటీలకి సంబంధించి కూడా సచివాలయాల సందర్శన కార్యక్రమం అనంతరం పేర్లను పంపాలని కోరుతున్నాను.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అద్భుతమైన ప్రజాస్పందన లభిస్తోందని తెలియచేశారు. సంక్షేమ పధకాలు అందుకుంటున్న లబ్దిదారులు ఆనందంగా ఉన్నారనే విషయం రాష్ర్టంలో ప్రతి ఒక్కరికి అర్ధమైంది. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం పట్ల ప్రజలు అచంచలమైన విశ్వాసంతో ఉన్నారనేది కూడా స్పష్టమైంది. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ మంత్రులతో చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర పూర్తిస్దాయిలో విజయవంతం అయిందని తెలిపారు.ప్రజలలో శ్రీ వైయస్ జగన్ గారికి, వైసీపీకి ఉన్న ఆదరణను బస్సుయాత్ర విజయవంతం అయిన తీరు తెలియజేస్తోందన్నారు. టెలీకాన్ఫరెన్స్ కు పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.