హర్యానా కి చెందిన భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్దళ్ (INLD) ఈ నెల 25న హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి రావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని INLD ఆహ్వానించింది. వీరితోపాటు దేశంలోని పలువురు కీలక నేతలను ఆహ్వానించినట్టు ఇండియన్ నేషనల్ లోక్దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ చౌతాలా తెలిపారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, NCP చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులను ఆహ్వానించినట్టు అభయ్ చౌతాలా తెలిపారు. ఇప్పటికే ర్యాలీకి హాజరవుతామని నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి సమస్యలపై చర్చించనున్నట్టు జేడీయూ నేత కేసీ త్యాగి చెప్పారు. బీజేపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని INLD చీఫ్ ఓపీ చౌతాలా తెలిపారు.