ఏలూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ లోపు వైసీపీ ప్రభుత్వం సర్పంచ్లకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ధర్నా చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ పక్ష సర్పంచ్లు కూడా నిధుల కోసం దీక్షలు చేశారని గుర్తు చేశారు. పంచాయతీలకు 40 శాతం నిధులు పెంచిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీది అని కానీ, ఆ నిధులు దారి మళ్లించి, జగన్ ప్రభుత్వం దోచేస్తుందని ఆరోపణలు చేశారు.
నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని సోము వీర్రాజు అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో టిడ్కో ఇళ్ళు ఇవ్వలేదన్నారు. పసుపు కుంకుమ కింద చంద్రబాబు 37 కోట్లు పెట్టారు కానీ, టిడ్కో ఇళ్లు మాత్రం పూర్తి చేయలేదన్నారు. అవినీతే సీఎం జగన్ బలం అన్నారు.
రాబోయే రోజుల్లో 5 వేల సభలు పెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనను ప్రజలకు తెలియజేస్తామని సోము వీర్రాజు అన్నారు. జనసేనతో, జనంతో మాత్రమే బీజేపీ పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏపీలో సైకలాజికల్, మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి నినాదంతో బీజేపీ రెండు కుటుంబ పార్టీలపై సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందని చెప్పుకొచ్చారు.
బంగారం ఎక్కడైనా దొరుకుతుంది గానీ రాష్ట్రంలోని ఇసుక దొరకడం లేదని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో ఇసుక దొరకాలంటే ఎన్నో షరతులు ఉన్నాయన్నారు. రోడ్డు పక్కన బండ్లపై వ్యాపారం చేసేవాళ్లు కూడా పేటీఎం వాడుతున్నారని, కానీ ప్రభుత్వ వైన్ షాపుల్లో మాత్రం పేటీఎం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కూడా అన్నీ జగన్ బ్రాండ్లే ఉన్నాయని ఎద్దేవా చేశారు.