జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పరిచిన దగ్గర నుండి అమరావతి రాజధాని మీద ఏదో ఒక రకంగా వివాదాలు సృష్టిస్తూనే ఉన్నారు.తాజాగా అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో గందరగోళానికి దారులు తీసింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామపంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభించింది. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయనున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో రాజధాని పరిధిలో గ్రామసభలు నిర్వహించారు. గతంలో 19 గ్రామాలతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను.. అన్నీ గ్రామాల్లోని ప్రజలు తిరస్కరించారు.
CRDA చట్టంలోని 29గ్రామాలతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాల్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు 22 గ్రామాలతో మున్సిపాలిటీ దిశగా చర్యలు చేపట్టింది. నోటీసులు అందుకున్న 10రోజుల్లోగా అభ్యంతరాల చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా సమాధానం ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీకి ఆమోదం తెలిపినట్లుగానే పరిగణిస్తామని పేర్కొన్నారు. గతంలో తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు రాజధాని పరిధిలో లేవు. ఇప్పుడు వాటిని కూడా కలిపి అమరావతి మున్సిపాలిటి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.