దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తీవ్రత కొద్దికొద్దిగా పెరుగుతోంది. రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా కలవరం మొదలైంది. పెరుగుతున్న కేసులు.. ఫోర్త్ వేవ్కు సంకేతమా అన్న గుబులురేగుతోంది. కొవిడ్ తన రూపాన్ని మార్చుకుంటూ.. ప్రభావం చూపనుండటంతో ముందస్తు చర్యలే మేలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అటు కరోనా కేసుల పెరుగుదల మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక సహా 5 రాష్ట్రాలలో స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 8,084 కరోనా కేసులు నమోదుకాగా, 10 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 4,592 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 4,32,30,101కు చేరాయి. అదే సమయంలో 5,24,771 మంది మరణించారు. 4,26,57,335 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇంకా 47,995 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.68 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.10 శాతం వద్ద ఉంది.రోజువారి పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. ఇప్పటివరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపింణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 11,77,146 మందికి వ్యాక్సినేషన్ చేశామని ఆరోగ్య శాఖ పేర్కొన్నది. ఇక కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2946 కేసులు, కేరళలో 4319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 నమోదైనట్టు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కేసులు నెమ్మదిగా పెరగుతుండడాన్ని చూస్తుంటే.. మరో మూడు నాలుగు వారాల్లో ఫోర్త్వేవ్ రావొచ్చనడానికి సంకేతమని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. మొన్నామధ్య ఢిల్లీలోనూ ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. ఈ గణాంకాలే ఫోర్త్వేవ్ వస్తుందనడానికి సంకేతాలని చెబుతున్నారు. అయితే, టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ మాత్రం ఇండియాలో ఫోర్త్వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటూ ప్రకటన చేసింది.
ఇండియాలో థర్డ్వేవ్ వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం తక్కుగానే ఉంది. ఫోర్త్ వేవ్ కూడా అంత ప్రభావం చూపించకపోవచ్చనేది నిపుణుల అంచనా. ఈసారి వచ్చే ఫోర్త్వేవ్లో కరోనా సోకినా సరే లక్షణాలు కనిపించకపోవచ్చంటున్నారు. లేదంటే స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా దేశంలో చాలా వరకు వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి.. ఆస్పత్రిలో చేరాల్సినంత సీరియస్ పరిస్థితి అయితే ఉండబోదని బలంగా చెబుతున్నారు. కాకపోతే, జాగ్రత్తలు పాటించడం, మాస్కులు వాడడం ద్వారా ఫోర్త్వేవ్ రాకుండా చూసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా…. కరోనాపై కఠినమైన నిఘా ఉంచాలని కేంద్రం ఐదు రాష్ట్రాలను హెచ్చరించింది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు రాసిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు.